Cross-Border Terrorism: పాకిస్తాన్లో పెరుగుతున్న అంతర్గత భద్రతా సంక్షోభానికి బాధ్యత తప్పించుకునేందుకు మరోసారి భారత పేరును లాగేందుకు ప్రయత్నించినట్టు కనిపించే వ్యాఖ్యలు చేశారు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. ఒక టీవీ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇటీవల పాకిస్తాన్లో జరిగిన దాడుల్లో.. ఆఫ్ఘాన్ పౌరులు చేసిన వాటిలో కూడా భారత్ చేయి ఉండొచ్చని ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపించారు.
భారత్ పై తీవ్ర ఆరోపణలు చేసిన పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్
“ఇండియాపై నమ్మకం లేదు… పూర్తి యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలి” అని ఆయన అన్నారు. “ భారత్ను నిర్లక్ష్యం చేయడం లేదు. ఏ పరిస్థితుల్లోనూ నమ్మడం కూడా లేదు. నా విశ్లేషణ ప్రకారం భారత్తో పూర్తిస్థాయి యుద్ధం కూడా పూర్తిగా తప్పదని అనిపిస్తోంది. ఇండియా నుంచి ఏదైనా శత్రుత్వ చర్యలు , బోర్డర్ దాడులు, ఆఫ్ఘాన్ పేరుతో దాడులు ఏవైనా జరగొచ్చు. అందుకే పూర్తి అప్రమత్తత అవసరం ” అని ఆసిఫ్ అన్నారు.
ఈ వ్యాఖ్యలు వస్తున్న సమయంలో పాకిస్తాన్ లోపలి భద్రత పూర్తిగా కుంగిపోతోంది. వరుసగా జరుగుతున్న ఆత్మాహుతి దాడులు, ప్రభుత్వం, సైన్యం మీద పూర్తి పట్టు కోల్పోతున్నట్లు చూపుతున్నాయి. ఒక నెలలోనే పాకిస్తాన్… ఒక్కోసారి ఆఫ్ఘాన్ను, ఒక్కోసారి భారత్ ను నిందిస్తూ వస్తోంది. దేశీయ విమర్శకులు మాత్రం.. “ఏళ్ళ తరబడి ఉగ్రవాద గ్రూపులను పెంచిన పాకిస్తాన్ ఇప్పుడు వాటి మూలంగా ముంచుకుపోతోంది” అని స్పష్టం చేస్తున్నారు.
అంతర్గత వైఫల్యాలను బయటివారిపై మోపే పాకిస్తాన్
ఇటీవల పాకిస్తాన్ రెండు పెద్ద ఆత్మాహుతి దాడులకు ఆఫ్ఘాన్ మూలాలు ఉన్నవారినే కారణమని ఆరోపించింది. దీంతో ఇరుక్కుపోయిన ఇస్లామాబాద్–కాబుల్ సంబంధాలు మరింత కఠినమయ్యాయి. గత వారం ఇస్లామాబాద్లోని ఒక కోర్టు వద్ద పోలీసు పహారా దగ్గర ఆత్మాహుతి దాడి జరిగి 12 మంది మృతి చెందగా, మరో 27 మంది గాయపడ్డారు. “పాకిస్తాన్ యుద్ధ పరిస్థితిలో ఉంది” అని ఆసిఫ్ ప్రకటించారు. కానీ, తమ భద్రతా వైఫల్యాలను అంగీకరించకుండా, మళ్ళీ భారత్పైనే తోసి వేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా “ఇవి ఇండియా నుంచి నడిపించే టెరర్ ప్రాక్సీలు” అని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్
“ వారు చెప్పేవన్ని పూర్తిగా అబద్ధాలు.. పాకిస్తాన్ ప్రజలను మోసం చేయడానికి తయారు చేసిన కథలు” అంటూ భారత్ మాత్రం పాకిస్తాన్ ఆరోపణలను ఘాటుగా తిప్పికొట్టింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. “పాకిస్తాన్ నాయకత్వం చేస్తున్న ఆరోపణలు అబద్ధం, ఆధారంలేనివి. వారు తమ దేశంలో జరుగుతున్న రాజకీయ అస్తవ్యస్తత, సైనిక జోక్యాన్ని ప్రజల దృష్టికి దూరం చేయడానికి భారత్ మీద తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు” అని స్పష్టం చేశారు.
