Army Chief Upendra Dwivedi: పాకిస్థాన్కు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇచ్చే వారిని (స్పాన్సర్స్) భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని, ఉగ్రవాద చర్యలకు భారత్ దీటుగా సమాధానం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఓ ఇంటరాక్టివ్ సెషన్లో జనరల్ ద్వివేది మాట్లాడుతూ, భారత్ తన పురోగతి, శ్రేయస్సుపై దృష్టి పెడుతోందని, ఈ ప్రయాణంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే, వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకు సాగలేవు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’ అనే భారత పాత వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. శాంతియుత ప్రక్రియకు భారత్ సహకరిస్తుందని, అయితే అప్పటివరకు ఉగ్రవాదులను, వారి స్పాన్సర్లను ఒకే విధంగా చూస్తామని తేల్చి చెప్పారు.
Also Read: Chain Snatching: ఎంతకు తెగించార్రా.. ఉదయాన్నే బరితెగించిన చైన్ స్నాచర్స్
తగ్గేదేలే..
పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నంత కాలం, భారత్ ఒక ‘న్యూ నార్మల్’ విధానాన్ని అనుసరిస్తుందని ఆర్మీ చీఫ్ తెలిపారు. భారత్ను లక్ష్యంగా చేసుకునే ఉగ్ర గ్రూపులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తే, ఈ విధానం వారికి ఒక పెద్ద సవాలుగా మారుతుందని ఆయన హెచ్చరించారు. భారతదేశం ఇప్పుడు ఏ విధమైన బెదిరింపులకు భయపడదని, మన రక్షణ వ్యవస్థలు బలంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి దేశ రాజకీయ నాయకత్వానికి సుముఖత ఉందని, ప్రస్తుతం భారతదేశ భద్రత, నిరోధక శక్తి చాలా బలంగా పనిచేస్తున్నాయని ద్వివేది విశ్వాసం వ్యక్తం చేశారు.

