BRS Plans: బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నది. జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో అలర్ట్ అయింది. ఎక్కడ లోటుపాట్లు జరిగాయి. ఎందుకు ఆశించిన ఫలితాన్నిరాబట్టలేకపోయామనే అంశాలపై సమీక్షించబోతున్నది. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, ప్రభుత్వ వైఫల్యాలను వివరించినా ప్రజలు ఎందుకు విశ్వసించలేదు. ఇంకా ఎలాంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని నేతల అభిప్రాయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే, సమీక్షించి అంతటితోనే ఆపుతారా? లేకుంటే అమలు చేస్తారా? పార్టీని గాడిలో పెడతారా? అనేది ఇప్పుడు పార్టీ నేతల్లో చర్చకు దారి తీసింది.
Also Read: Kavitha Vs BRS: కవితతో టచ్లో ఉన్నది ఎవరు?.. బీఆర్ఎస్ అధిష్టానం ఆరా?
18న కీలక సమావేశం
ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ (BRS )ముందుకు సాగింది. సర్వశక్తులు ఒడ్డింది. పార్టీ సీనియర్లను, కేడర్ను రంగంలోకి దింపింది. దాదాపు రెండు నెలల పాటు నియోజకవర్గంపై దృష్టి సారించింది. అయినప్పటికీ గెలుపు ముంగిట కారు పల్టీ కొట్టింది. దీంతో పార్టీపై దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఉప ఎన్నిక ఫలితంపై ఈ నెల 18న ఆ నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కేడర్తో ప్రత్యేక భేటీ అవుతున్నారు. ఓటమికి గల కారణాలను ఇందులో సమీక్షించనున్నట్లు సమాచారం. ప్రచారంలో లోపం జరిగిందా? పార్టీ నేతలు పని చేయలేదా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఆశించిన స్థాయిలో తీసుకెళ్ల లేకపోయామా? లేకుంటే పార్టీ నేతలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించక పోవడమా? ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా? అనేది లోతుగా సమీక్షించబోతున్నట్లు సమాచారం. పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకొని ఆ మేరకు పని చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
గతంలో కూడా ఇలాగే
అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత నియోజకవర్గాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో తెలంగాణ భవన్లో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. నేతలు, ద్వితీయశ్రేణి నేతలు, సీనియర్ నాయకులు తమ అభిప్రాయాన్ని కేటీఆర్, హరీశ్ రావు, మాజీ మంత్రుల సమక్షంలోనే వెల్లడించారు. పార్టీ ఓటమికి గల కారణాలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసినవారి వ్యవహార శైలి, ప్రచారంలో వెనుకబడడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేశారని, మొదటి నుంచి పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని దీంతో పార్టీకి నష్టం జరిగిందని కొందరు బహిరంగంగానే వెల్లడించగా, మరికొందరు మాత్రం స్లిప్పుల ద్వారా సమస్యను పార్టీకి అందజేశారు. అయితే, సమీక్షించాల్సిన పార్టీ వాటిని పక్కన పెట్టిందని పలువురు నేతలు తర్వాత బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీని ప్రక్షాళన చేయకుండా ఏం చేసినా లాభం ఉండదని, వ్యతిరేకంగా పని చేసిన నేతలపై సైతం చర్యలు తీసుకోవాలని కేడర్ కోరినా పెడచెవిన పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, జూబ్లీహిల్స్ ఓటమి నేపథ్యంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న పార్టీ గతంలో మాదిరిగానే వ్యవహరిస్తుందా అనేది ఇప్పుడు పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది.
కమిటీల విషయంలో అసంతృప్తి
క్షేత్రస్థాయిలో పార్టీకి కమిటీలు లేవు. ఏళ్లు గడుస్తుంది కానీ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి కమిటీలు వేయలేదు. అనుబంధ కమిటీలు సైతం నియమించలేదు. ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పని చేస్తున్న వారికి గుర్తింపు లేదు. కమిటీల్లో అవకాశం ఇస్తారని భావించిన వారికి నిరాశే ఎదురవుతున్నది. నేతలకు పదవులు ఇవ్వకుండా పార్టీ కోసం పని చేయాలని, ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించాలని అధిష్టానం ఆదేశిస్తే ఎలా పని చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా కొంతమంది నేతలు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వారి వ్యవహారశైలిలో మార్పు రాకపోవడం, పార్టీ కేడర్కు సైతం అందుబాటులో ఉండకపోవడం, నియంతృత్వ పోకడలనే అవలంభిస్తుండడంతో పార్టీకి ప్రజల నుంచి సైతం సరైన ఆదరణ రావడం లేదని సమాచారం. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్కు మొగ్గు చూపడం లేదనేది తాజా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సైతం స్పష్టం చేస్తున్నది. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ప్రక్షాళన చేపడుతుందా లేదా అనేది చూడాలి.
Also Read: Health Tips: చలి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడే బెస్ట్ ఇమ్యూనిటీ బూస్ట్ పానీయాలు
