Kavitha Vs BRS: చాంతాడంత లిస్టులో ఉన్న నేతలెవరు?
కావాలని లీకులా? మైండ్ గేమా?
పార్టీపై నిర్ణయం తీసుకోలేదంటూనే సంప్రదింపులు
గులాబీ అధిష్టానం సైతం ఆరా?
కవిత కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న బీఆర్ఎస్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు వచ్చిన ప్రతిసందర్భం సంచలనంగా మారుతోంది. ఎప్పుడు, ఎవరి మీద ఏ ఆరోపణలు చేస్తారోనన్న భయం రాజకీయ నాయకులను (Kavitha Vs BRS) కలవర పెడుతోంది. బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ, అధికారపార్టీ అనే తేడా లేకుండా విమర్శలు చేస్తున్నారు. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. తాజాగా కవిత మరో బాంబు పేల్చారు. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు తనతో టచ్లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ నేతలు ఎవరు?, ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడాలనుకుంటున్నారు?, ఎందుకు సంప్రదింపులు చేస్తున్నారు? అనేది ఇప్పుడు గులాబీ పార్టీలోనూ చర్చకు దారితీసింది. చాంతాడంత ఉన్న లిస్టులో ఉన్నది ఎవరెవరు? అనేది కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
పార్టీని పెట్టబోనంటూనే సంప్రదింపులు చేస్తున్నారు. పార్టీ పెడితే తమకు అవకాశం ఇవ్వాలని ముందస్తుగానే బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నేతలు సైతం కవితతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది నేరుగా కలవడం, మరికొందరు ఫోన్లు చేసి ఆశీర్వాదం కావాలని అడుగుతున్నట్లు సమాచారం. శనివారం కవిత మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు సంప్రదిస్తున్నారని, వారి లిస్టు చెప్పాలంటే చేంతాడంతా ఉందని, అది సమయం వచ్చినప్పుడు చెబుతానని స్పష్టం చేశారు. ఇంతకు ఆ లిస్టులో కీలక నాయకులు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ లిస్టులో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంతమంది బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నవారు సైతం ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది.
కావాలని మాట్లాడారా?
మరోవైపు కవిత కావాలని బీఆర్ఎస్ సీనియర్ నేతలు టచ్లో ఉన్నారని వ్యాఖ్యలు చేశారా? అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీని డీమోరల్ చేసేందుకా?, నిజంగానేనా? లేకుంటే మైండ్ గేమ్లో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారా? అనేది కూడా హాట్ టాపిక్ అయింది. త్వరలోనే లిస్టు చెబుతానని చెప్పడంతో గులాబీ పార్టీలోని కొంతమంది ఆ నేతలు ఎవరు అనేది ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంచితే, కవిత ఎప్పుడూ ఏం చేస్తున్నారు? ఎవరెవరు ఆమెను కలుస్తున్నారు? జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఏం చేయబోతున్నారు? అనే వివరాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ తెలుసుకుంటున్నట్లు సమాచారం. అందుకు ఉదాహరణ, కవిత ఇంటికి ఆమె తల్లి శోభ వచ్చిన విషయం సైతం ఇంట్లో పనిమనుషులకు కూడా తెలియదని, కానీ బీఆర్ఎస్లో ఓ నేత ఆ వివరాలను లీక్ చేశాడని, వార్తలు కూడా రాయించాడని కవితనే ఆరోపించారు.
Read Also- Telangana BJP: పదవులు దక్కనివారి ఆశలన్నీ ఆ పోస్టుపైనే.. అతి త్వరలో బీజేపీ నియామకాలు
కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బిజీబిజీ అయ్యారని, తన భవిష్యత్ కార్యాచరణ చాలా స్ట్రాంగ్గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె అనుచరులు తెలిపారు. అందుకు అనుగుణంగా స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో తన పాత్ర ఏ విధంగా ఉండాలి, ప్రజలకు సేవ చేసేందుకు ఏం చేయాలన్న దానిపై ఆమె కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. మహిళలు, విద్యార్థులు, యువత, కవులు, సాహితి వేత్తలు, కార్మికులు ఇలా సమాజంలోని సుమారు 25 వర్గాల వారితో సమాలోచనలు చేస్తున్నారు. ఆయా వర్గాల ప్రజలు ఇస్తున్న సలహాలు, సూచనలను నోట్ చేసుకుంటున్నారు. అసలు తెలంగాణ ఏం ఆశించింది? ఇప్పటివరకు ఏం జరిగింది? భవిష్యత్లో ఏం చేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. నవ తెలంగాణ నిర్మాణం జరగాలంటే చేయాల్సిన పనులపైనా కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్లో ఏయే అంశాలపై పోరాటం చేయాలి, భావి తెలంగాణలో తన పాత్ర ఎలా ఉండాలన్న దానిపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
Read Also- Bigg Boss Telugu 9: రీతూకి తలంటేసిన కింగ్.. డీమాన్ కెప్టెన్సీ తొలగింపు
తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ స్థాపించే ముందు కేసీఆర్ ఏ విధంగా అన్ని వర్గాలతో సమావేశమయ్యారో… సరిగ్గా అదే విధానాన్ని కవిత పాటిస్తున్నారు. భవిష్యత్లో తాను లేవనెత్తే అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండే విధంగా సిద్దమవుతున్నారు. తెలంగాణకు ఏం కావాలన్నది చర్చిస్తున్నారు. ఏయే రంగాల్లో ఏం చేయాలన్న దానిపై అవగాహన పెంచుకుంటున్నారు. తనను కలుస్తున్న వారితోనే కాకుండా సాహితీ వేత్తలు, మేధావులు, పలు రంగాల్లో నిష్ణాతులు, ప్రొఫెసర్లు, రిటైరైన ఉన్నతాధికారులను స్వయంగా కలిసి వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గతంలో ఆమె ఎంపీగా పనిచేసిన సమయంలో దేశ వ్యాప్తంగా ప్రముఖ పార్టీల నేతలు, ప్రముఖ నాయకులతో కవితకు పరిచయాలు ఏర్పడ్డాయి. వారితోనూ ఆమె చర్చలు జరుపుతున్నారు. ప్రజాసేవలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై వారి అనుభవం, సలహాలు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది నేతలు వచ్చి కవితను కలిసి వారి సలహాలు, సూచనలు ఇచ్చారు.