Kunamneni Sambasiva Rao: కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే సమాజంలో ప్రజలకు రక్షణ ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) అన్నారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలు సందర్భంగా జోడేఘాట్ నుండి సీపీఐ బస్సు యాత్రను ఆయన ప్రారంభించారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులకే భవిష్యత్తు ఉంటుందని, ప్రజలు చట్టసభల్లో కమ్యూనిస్టులు బలంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సీపీఐ ఉద్యమిస్తున్నదని, ముఖ్యంగా నిరుపేదల కోసం అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్నదన్నారు.
26న ఖమ్మంలో లక్షలాది మందితో సభ
ఎర్రజెండా పోరాటాలతో పేదలకు భూములు దక్కుతాయని, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాల జాతీయ స్థాయి ముగింపు సభ డిసెంబర్ 26న ఖమ్మంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలోని మతోన్మాదాన్ని తరిమి కొట్టుటకు, సమ సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టులు ఏకం కావాలన్నారు.
ఈ బస్సు యాత్రలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, డీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారపాక అనిల్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంట రెడ్డి, ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, నాయకులు లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామడుగు లక్ష్మణ్, సీపీఐ ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి బద్రి సాయి, సహాయ కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి, సీనియర్ నాయకులు బద్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
