Miryalaguda: ప్రభుత్వం సాధారణ రకం(వరి)కి మద్దతు ధర రూ. 2369, గ్రేడ్_ఏ రకానికి రూ. 2389 ధర నిర్ణయించింది. అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడ, హాలియా సహా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైస్ మిల్లర్లు సీజన్ ప్రారంభంలో క్వింటాళ్ల వరికి రూ. 2620, 2630 కొనుగోలు చేసిన రైస్ మిల్లర్లు ప్రస్తుతం క్వింటాళ్లకు రూ. 2570, రూ. 2450 చెల్లిస్తున్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో గడచిన 15 రోజులుగా సన్నధాన్యం మిల్లులకు వస్తోంది.
Also Read: Nalgonda district: కాలుష్యం వెదజల్లుతున్న రైస్మిల్లులు.. పట్టించుకొని అధికారులు
మిల్లర్లు ఇష్టా రాజ్యం
తమ మిల్లులకు అనుకున్న స్థాయిలో ధాన్యం వచ్చేవరకు క్వింటాళ్లకు రూ. 2600 ధర చెల్లించిన మిల్లర్లు నాలుగు రోజుల క్రితం క్వింటాళ్లకు రూ. 2380, 2450 మాత్రమే చెల్లించారు. మళ్లీ క్వింటాళ్లకు రూ. 2550 లెక్కన చెల్లించారు. క్వాలిటీ వడ్లను తెస్తున్న అంతకుముందు చెల్లించిన ధరను ఇవ్వకుండా మిల్లర్లు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు హమాలీ, గుమస్తా, వేయింగ్ మిషన్ రుసుము, సీసీ(క్యాష్ క్రెడిట్) అంటూ రైతులు తెచ్చిన ధాన్యంపై క్వింటాళ్లకు రూ. 49 రూపాయలను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇటీవల ఓ రైతు 88 క్వింటాళ్ల వడ్లను ఓ మిల్లులో విక్రయించగా వివిధ చార్జీల పేరిట రూ. 4 వేలను తీసుకోవటం విశేషం.
తరుగు పేరిట కోట్లు దండుకున్న వైనం
వరి కోత మిషన్ ద్వరా నాణ్యమైన వడ్లను ట్రాక్టర్ల (బోరం)లో నింపి మిల్లులకు తెస్తున్నారు. అయితే మిల్లర్లు మట్టి, తాలు పేరిట ఒక్కో ట్రాక్టర్ లో ఉన్న (25, 50 క్వింటాళ్ల లోడ్) నుంచి 30 కేజీల తరుగు తీస్తున్నారు. దీంతో రైతన్న రూ. 600 నుంచి రూ. 1100 వరకు నష్టపోతున్న పరిస్థితి ప్రతి సీజన్ లో కొనసాగుతోంది. ప్రస్తుత ఖరీఫ్ లో మిర్యాలగూడ పరిధిలోని
90 రైస్ మిల్లులు సన్న వడ్లు కొనుగోలు చేస్తున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొనుగోలు చేయగ మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
రానుందని లోకల్ మిల్లర్లు తెలిపారు. అయితే ఈ సీజన్ లో 40( 4 లక్షల మెట్రిక్ టన్నులు) లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసిన స్థానిక మిల్లర్లు క్వింటాళ్లకు చెల్లించిన ధరపై తరుగు విధిస్తున్నారు. వేలకోట్ల బిజినెస్ చేస్తున్న మిల్లర్లు తరుగు పేరిట భారీగా దండుకున్నట్లు తెలుస్తోంది. రైతులపై హమాలీల చార్జీలు ధాన్యం తరుగు పై సివిల్ సప్లై ఆఫీసర్ ను సంప్రదించగా స్పందించకపోవడం గమనార్హం.
రైతులకు నష్టం : చల్లా ఆంజనేయులు, అన్నపురెడ్డిగూడెం
మాది వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం. మా గ్రామం నుంచి సమీప మిల్లులకు సన్న ధాన్యం తెచ్చి విక్రయిస్తున్నాం. మిల్లర్లు హమాలి చార్జీలు, సీసీ (క్యాష్ క్రెడిట్), తరుగు నెపంతో లోడ్ పై 3 వేల వరకు తీసుకుంటున్నారు. రైతులకు పెద్ద ఎత్తున నష్టం వస్తుంది. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలి.
Also Read: Meenakshi Natarajan: లోకల్ బాడీ ఎన్నికలకు నిఘా కమిటీలు? ముఖ్య నాయకులతో మీనాక్షి ఇంటర్నల్ మీటింగ్
