Naxal Operation: కర్రెగుట్టల ప్రాంతంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిగినట్లు విశ్వాసనీయంగా తెలుస్తోంది. గత కొంతకాలంగా కర్రెగుట్టల ప్రాంతంలో హిడ్మ(Hidma) సంచరిస్తున్నాడని నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో విస్తృతంగా అడవులను జల్లెడ పడుతున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టులు సంచరించిన ప్రాంతాలపై భద్రతా బలగాలు నిఘాతో వ్యవహరిస్తున్నాయి. ఆ ప్రాంతంలోనే భారీగా ఐఈడి(IED) తయారీ వస్తువులను సైతం భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా ఇటీవలనే 40 కేజీల ఐఈడి బాంబును సైతం గుర్తించి నిర్వీర్యం చేశారు.
గత కొంతకాలంగా గోదావరి పరివాహక ప్రాంత అటవీ ప్రదేశాల్లో హిడ్మా నిఘా వర్గాలు భావించి ఆటో దిశగా కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల భద్రత బలగాలు క్షుణ్ణంగా అడవులను పరిశీలిస్తున్నారు. డ్రోన్ కెమెరా(Drone camera)లు, ఇతర అత్యాధునిక టెక్నాలజీతో మావోయిస్టుల కదలికలపై దృష్టి పెడుతూ వస్తున్నారు. ఆ క్రమంలోనే పి ఎల్ జి ఏ మొదటి బెటాలియన్ తడపల ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా నిఘవర్గాలు భావించాయి. ఆ కోణంలోనే భద్రతా బలగాలు సైతం పి ఎల్ జి ఏ మొదటి బెటాలియన్ ను మట్టు పెడితే మావోయిస్టు వ్యవస్థను తుది అంకానికి తీసుకురావచ్చని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
బేస్ క్యాంప్ లక్ష్యంగా కాల్పులు
భద్రాచలం(Bhadrachalam) నియోజకవర్గం లోని చత్తీస్గడ్(Chhattisgarh) రాష్ట్రానికి అతి సమీపంలో ఆనుకొని ఉన్న చర్ల మండలానికి కొద్ది దూరంలోని ఉన్న అటవీ ప్రాంతంలో తడపల బేస్ క్యాంప్ లో ఉన్న భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఐదు రౌండ్ల పాటు కాల్పులు జరిపి పారిపోయినట్లుగా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతంలోనే కేంద్ర భద్రతా బలగాలు అత్యధికంగా మోహరించి మావోయిస్టు చర్యలపై ఉక్కు పాదం మోపేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అటు మావోయిస్టులు… ఇటు భద్రత బలగాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. మావోయిస్టులను మట్టు పెట్టడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతుంటే తమపై దాడులే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భద్రత బలగాలకు అడ్డుకట్ట వేయాలని మావోయిస్టులు భావిస్తూ ఈ చర్యలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
హిడ్మా లక్ష్యంగా బలగాల కూంబింగ్..
బీజాపూర్, నారాయణపూర్, దంతే వాడ, సుక్మా జిల్లాలో జిల్లాలో మావోయిస్టుల చర్యలపై భద్రత బలగాలు ఉక్కు పాదం మోపుతూ ఓవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాటు ప్రక్రియలను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రత బలగాల దాటికి తట్టుకోలేక మావోయిస్టులు పోలీసుల ఎదుట అత్యధికంగా లొంగిపోతున్నారు. దీంతో దండకారణ్యంలో పి ఎల్ జి ఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్ల ఆర్మీ) మొదటి బెటాలియన్ ప్రథమంగా భావిస్తూ భద్రత బలగాలు కూంబింగ్ చర్యలను చేపడుతుంది. నంబాల కేశవరావు(Nambala Kesava Rao) ఎన్కౌంటర్ ముందు దండకారణ్యంలో సూపర్ యాక్టివ్ గా పనిచేసే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(People’s Liberation Guerrilla Army) మొదటి బెటాలియన్ కు హిడ్మా కమాండర్ గా వ్యవహరించేవాడు.
ఆ తర్వాత పార్టీలో కీలక పదవి మిలటరీ కమిషన్ అధిపతిగా హెడ్మాకు అప్పజెప్పడంతో ఆ పి ఎల్ జి ఏ మొదటి బెటాలియన్ కు దామోదర్ ఇన్చార్జిగా నియమించారని విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే భద్రత బలగాలు తడపల బేస్ క్యాంపు వద్ద భారీగా మోహరించి మావోయిస్టు కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు ప్రణాళిక రచించినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం భద్రత బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో తారసపడడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ఈ విషయమై పూర్తిస్థాయిలో సమాచారం అందాల్సి ఉంది.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				