Haryana: హర్యానాలోని ఫరీదాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏఐ సాయంతో ముగ్గురు సోదరిమణుల అశ్లీల వీడియోలను సృష్టించిన ఓ వ్యక్తి.. బాధితుల సోదరుడ్ని బెదిరించాడు. లక్షల్లో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో వేధింపులు తాళలేక సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగు చూడగా.. ప్రస్తుతం అవి యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
ఫరిదాబాద్ కు చెందిన 19 ఏళ్ల రాహుల్ భారతి (Rahul Bharti).. స్థానిక డీఏవీ కాలేజీ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. రాహుల్ తండ్రి మనోజ్ భారతి తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరో వ్యక్తి రాహుల్ మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి కృత్రిమ మేధా (ఏఐ) సాంకేతికతతో రాహుల్, అతని సోదరీమణుల అసభ్య ఫోటోలు, వీడియోలు తయారు చేశాడు. ఈ ఘటనతో రాహుల్ గత రెండు వారాలుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆహారం సరిగ్గా తినకపోవడంతో పాటు గదిలో మౌనంగా ఉండిపోయాడని తండ్రి తెలిపారు. ఈ క్రమంలోనే రాహుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
డబ్బు ఇవ్వాలని బెదిరింపులు
పోలీసు దర్యాప్తులో.. రాహుల్, ‘సాహిల్’ అనే వ్యక్తి మధ్య చాట్ రికార్డులు బయటపడ్డాయి. రాహుల్కి సాహిల్ అసభ్య ఏఐ వీడియోలు పంపి రూ.20,000 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తేలింది. వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లలో ఇద్దరి మధ్య అనేక ఆడియో, వీడియో కాల్స్ ను పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా తాను చెప్పిన లోకేషన్ కు రావాలని రాహుల్ కు సాహిల్ పంపిన సందేశం కూడా చాట్ లో బయటపడింది. ఇక చివరి సంభాషణలో సాహిల్ డబ్బు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని రాహుల్ ను హెచ్చరించాడు. డబ్బు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకోవాలని పరోక్షంగా ప్రేరేపించినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: Karimnagar Crime: రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. పక్కింటి వారితో కిటికీ లొల్లి.. ప్రాణం తీసుకున్న మహిళ
తెరపైకి మరో వ్యక్తి పేరు
సాహిల్ బెదిరింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన రాహుల్.. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో నిద్రమాత్రలు మింగాడు. అతని ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రాహుల్ మరణానికి నీరజ్ అనే వ్యక్తి కూడా కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చనిపోవడానికి కొద్ది గంటల ముందు నీరజ్ తో రాహుల్ మాట్లాడినట్లు పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి విష్ణుకుమార్ తెలిపారు. దర్యాప్తు ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
