Kishan Reddy: జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ ఏ పార్టీ నాయకుడు ప్రజల మధ్య ఉంటాడో, వారి సమస్యలు వింటాడో వారికే ఓటు వేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రజలకు పిలుపునిచ్చారు. మజ్లీస్ మద్దతిచ్చిన వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి అని, మజ్లిస్ పార్టీ కబంధ హస్తాల నుండి హైదరాబాద్ను రక్షించుకోవాలని కోరారు. మంగళవారం బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి హైలంకాలనీలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో రాంచందర్రావు, కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Also Read: Kishan Reddy: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించింది మజ్లిసే.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పాలి
అనంతరం హైలంకాలనీ నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… జూబ్లీహిల్స్ లో పొంగిపొర్లుతోందని, ఎక్కడ చూసినా పరిసరాలు చెత్తాచెదారంగా మారిపోయాయని పేర్కొన్నారు. గత సీఎం కేసీఆర్.. హైదరాబాద్ను సింగపూర్, వాషింగ్టన్ చేస్తానని అబద్ధాలు చెప్పేవాడని, ప్రస్తుతం ఫామ్హౌస్లో ఉన్నారని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వీధి దీపాలు ఏర్పాటు చేయడంలో కూడా ఇబ్బంది పడుతోందని, ఇలాంటి ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉండేదన్నారు. కానీ ఈ 12 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొద్ది కాలంలోనే రూ. 3 లక్షల కోట్ల అప్పులు చేసిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక రకాల హామీలు ఇచ్చిందని, అవి అమలు చేయడం లేదన్నారు. మహిళలు ప్రయాణించుకోవడానికి ఉచిత బస్సు మాత్రం ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ లాగే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా మాటలతో కోటలు కడుతున్నాడని ఎద్దేవా చేశారు.
కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తాం
గెలిపిస్తే కేంద్రం నిధులతో అభివృద్ధి బండి సంజయ్ జూబ్లీహిల్స్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేననీ, రెండు పార్టీలు కలిసి దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీల పాలనలో జూబ్లిహిల్స్ ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి స్థలాన్ని మజ్లిస్ కు ధారాదత్తం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పై కోపంతో బీఆర్ఎస్ కు ఓట్లేస్తే ఇక అంతే సంగతులన్నారు. బీజేపీని గెలిపించాలని, ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే పట్టించుకోరనీ, హరీష్ రావు చెబితే ఎన్ కౌంటర్లు చేస్తారని పేర్కొన్నారు. అసద్ కాంగ్రెస్ కు మద్దతిస్తే, తమ్ముడు బీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. బీజేపీని ఓడించేందుకు మజ్లీస్ దేశమంతా పోటీ చేస్తోందని తెలిపారు. ఎంఐఎం జూబ్లిహిల్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశధ్నించారు.
బీజేపీ మజ్లీస్ మధ్యనే పోటీ: రాంచందర్రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ.. మజ్లిస్ మధ్యే ప్రధాన పోటీ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ప్రజలు ఇప్పటికే బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారని తెలిపారు. నగరంలోని కాలనీల్లో డ్రైనేజ్ వాసనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు గతంలో ఏ ప్రభుత్వమూ అభివృద్ధి, పథకాల అమలులో సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరిట 421 వాగ్దానాలు చేసి, మళ్ళీ ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి పార్టీకి ప్రజలు పెట్టే సరైన బిరుదు ‘420 పార్టీ’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్రావు, ఎమ్మెల్యే పాయల శంకర్, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమరయ్య, మాజీ మంత్రి కృష్ణయాదవ్, ఆ పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, గౌతమ్ రావు, బండ కార్తీకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Kishan Reddy: ప్రజల కోసమే పనిచేస్తాం.. రేవంత్ రెడ్డి కోసం కాదు!
