Firecracker Accident: జోగిపేట సమీపంలోని కట్టుకం వేణుగోపాల్ అండ్ సన్స్ టపాకాయల దుకాణం(Venugopal and Sons Fireworks Shop)లో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో సుమారుగా రూ.25 లక్షల రూపాయల విలువ చేసే టపాకాయలు పేలి బూడిదయ్యాయి. ఈ సంఘటన ప్రమాద వశాత్తు జరిగిందా? ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేసారా అన్ని విషయం తెలియాల్సి ఉంది. గత నెల రోజులుగా ఈ దుకాణంలో భారీగా విక్రయాలు జరుపుతున్నాయి. దగ్దమైన షాపునకు 50 మీటర్ల దూరంలో ఉన్న గోడౌన్లో లక్షల విలువ చేసే టపాకాయలు నిలువ ఉన్నాయి. ఈ సంఘటన కారణంగా అటువైపు టపాసులు ఎగిరిపడకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పినట్లయ్యింది. . వరుసగా బాంబుల మోత మోగడంతో కొన్ని క్షణాల పాటు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
భారీ మంటలతో పేలుళ్ల శబ్దాలు
కొనుగోలు చేయడానికి వచ్చిన వారంతా ఉరుకులు, పరుగులు తీసారు. కొంత మంది ఇదే అదనుగా భావించి సంచుల్లో టపాకాయలను ఎత్తుకొని పారిపోయారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో గంట పాటు భారీ మంటలతో పేలుళ్ల శబ్దాలు సంభవిస్తున్నాయి. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో కొనుగోలు దారులు అప్రమత్తం కావడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది జోగిపేట(Jogipet), సంగారెడ్డి ఫైర్ ఇంజన్ల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జోగిపేట సీఐ అనీల్కుమార్ పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు.
Alsom Read: Gadwal District: మగవాళ్లకు పౌష్టికాహారంపై అవగాహన అవసరం: కలెక్టర్ బి.ఎం సంతోష్
జిల్లా ఫైర్ అధికారి సందర్శన..
జోగిపేట సమీపంలో టపాకాయల హోల్సేల్ షాపు దగ్దం కావడంతో వివరాలు తెలుసుకున్న జిల్లా ఫైర్ అధికారి నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన వివరాలను ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. ఎంత నష్టం జరిగిందన్న వివరాలు తెలుసుకుందామంటే యజమాని అందుబాటులో లేరని తెలిసింది. ఫైర్ సేఫ్టీకి సంబం«ధించి అన్ని చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో 400 టెంపరరీ, 6 పెద్ద షాపులకు సంబంధించి అనుమతులున్నాయని, ఆయన తెలిపారు.
Also Read: Hydra: గోషామహల్ నియోజకవర్గంలో.. రూ. 110 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా!
