Viral Video: బెంగాల్ (West Bengal)లోని మేదినీపూర్ జిల్లా (Medinipur District)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏనుగుల గుంపును కొందరు ఆకతాయిలు వేధించారు. తోక పట్టుకొని కవ్వించడమే కాకుండా వాటికి పైకి రాళ్లు రువ్వి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్య ప్రాణులతో ఆకతాయిగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియోలో ఏముందంటే?
వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. కొందరు యువకులు ఏనుగుల గుంపునకు చాలా దగ్గరగా నిలబడి ఉన్నారు. ఏనుగులు చెట్ల మధ్య నిలబడి ఉండగా వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఓ వ్యక్తి ఏనుగు వెనుక గుండా వెళ్లి తోకను పట్టుకోవడం వీడియోలో గమనించవచ్చు. దీంతో ఏనుగు ఒక్కసారిగా యువకుడి వైపు తిరగ్గా.. అతడు వెంటనే దూరంగా పరిగెత్తుకెళ్లాడు. మరోవైపు ప్రశాంతంగా ఉన్న ఏనుగులపై అక్కడే ఉన్న మరికొందరు రాళ్లు రువ్వారు. వాటిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. ఈ వీడియోను ఓ వ్యక్తి షేర్ చేస్తూ ‘ఇక్కడ జంతువులు ఎవరు?’ అని ప్రశ్నించాడు.
చట్టరిత్యా నేరం
భారతదేశంలోని వన్యప్రాణి సంరక్షణ చట్టం (Wildlife Protection Act) ప్రకారం.. అడవి జంతువులను ఇలా వేధించడం లేదా రెచ్చగొట్టడం శిక్షార్హం. నెట్టింట వేలాది మంది యూజర్లు.. ఏనుగులను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా జంతువుల పట్ల నిర్లక్ష్య ప్రవర్తనను అరికట్టాలని అధికారులకు సూచిస్తున్నారు.
View this post on Instagram
Also Read: Most Wanted Criminal: 45 కేసుల్లో నిందితుడు.. రోడ్డు ప్రమాదంతో అడ్డంగా బుక్కయ్యాడు.. భలే విచిత్రంగా ఉందే!
నెటిజన్ల మండిపాటు..
ఏనుగులను వేధిస్తున్న వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ యూజర్ వ్యాఖ్యానిస్తూ ‘ఈ వ్యక్తులకు ఏనుగుల జ్ఞాపకశక్తి గురించి తెలియకపోవచ్చు. చెడు అనుభవాలను ఏనుగు ఎప్పటికీ మరచిపోదు. భవిష్యత్తులో అదే ఏనుగు వీరిని చూస్తే విడిచిపెట్టదు’ అని పేర్కొన్నారు. మరొక యూజర్.. ‘మనుషులు.. జంతువులను కేవలం వినియోగ వస్తువులుగా మాత్రమే చూస్తారు. ప్రేమ, కరుణ, గౌరవం చూపే మనస్తత్వం కొందరికి లేదు’ అని అన్నారు. ‘ఆ ఏనుగు చాలా హుందాగా ప్రవర్తించింది. అది తలుచుకుంటే ఆ మనిషిని తొక్కి చంపేసేది. కానీ దయ చూపించింది’ అని ఓ యూజర్ చెప్పుకొచ్చారు.
