Cyber Criminals: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) భరతం పడుతూ, బాధితులకు ఊరట కలిగిస్తున్నారు. రకరకాల మోసాలతో అమాయక ప్రజల నుంచి లక్షలు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్ను గుర్తించి, ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా అరెస్ట్ చేస్తూ జైలుకు పంపిస్తున్నారు. గత ఒక్క నెలలోనే పోలీసులు ఏకంగా 8 వేర్వేరు రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు నిర్వహించి 59 మంది సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. అంతేకాకుండా, బాధితులు పోగొట్టుకున్న దాంట్లో రూ.86.64 లక్షల భారీ మొత్తాన్ని తిరిగి వారికి అందేలా చర్యలు తీసుకున్నారు.
అత్యాశలో చిక్కుతున్న ప్రజలు
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు విస్తృతస్థాయిలో చర్యలు తీసుకుంటున్నా, క్రిమినల్స్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చనే అత్యాశతో తమకు తాముగా నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవడం గమనార్హం. సెప్టెంబర్ నెలలోనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 222 కేసులు, జోనల్ సైబర్ సెల్ యూనిట్లలో 106 ఎఫ్ఐఆర్లు సహా మొత్తం 328 సైబర్ మోసాల కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరించే డిజిటల్ అరెస్టుల కేసులు, పార్ట్టైమ్ ఉద్యోగాలు, పెళ్లి సంబంధాల మోసాలు వంటివి ఉన్నాయి.
Also Read: Cyber Criminals: ఏటా పెరిగిపోతున్న సైబర్ నేరాలు.. ప్రతీ నెల19 వందల కోట్లు మాయం
దేశవ్యాప్తంగా వేట
ఈ ఫిర్యాదులపై సీఐలు నరేశ్, సతీష్ రెడ్డి, దిలీప్ కుమార్, మధుసూదన్ రావు, ఎస్ఐలు సురేష్, మన్మోహన్ గౌడ్, మహిపాల్ తమ సిబ్బందితో కలిసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా, నిందితులను పట్టుకోవడానికి ఏపీ, అస్సాం, బిహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిషా, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించారు. ఇందులో అత్యధికంగా మన రాష్ట్రంలోనే 74 మందిని, మహారాష్ట్ర నుంచి 53 మందిని, కర్ణాటక నుంచి 38 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి మొబైల్ ఫోన్లు, చెక్ బుక్కులు, పాస్ బుక్కులు, డెబిట్ కార్డులు, ల్యాప్టాప్లు, షెల్ కంపెనీల స్టాంపులు, సిమ్ కార్డులను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టుల్లో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
రూ.86 లక్షలను బ్యాంకుల నోడల్ అధికారులతో సమన్వయం చేసి ఫ్రీజ్
కేసుల దర్యాప్తుతో పాటు, మోసపోయిన బాధితులకు డబ్బు తిరిగి ఇప్పించడంలో పోలీసులు చురుకుగా వ్యవహరించారు. ఇన్వెస్ట్మెంట్, ఓటీపీ, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాల్లో పోగొట్టుకున్న రూ.86 లక్షలను బ్యాంకుల నోడల్ అధికారులతో సమన్వయం చేసి ఫ్రీజ్ చేయించారు. అనంతరం కోర్టుల అనుమతితో ఆ మొత్తాన్ని బాధితులకు అందజేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత ఈ సందర్భంగా ప్రజలను హెచ్చరిస్తూ, మోసపోయి డబ్బు పోగొట్టుకున్నట్లయితే, మొదటి గంటలోనే (గోల్డెన్ హవర్) ఆలస్యం చేయకుండా 1930 నెంబర్కు ఫోన్ చేసి, cybercrime.gov.in కు మెయిల్ ద్వారా ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. మొదటి గంటలో ఫిర్యాదు చేస్తే, డబ్బును ఫ్రీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, లేదంటే కేటుగాళ్లు ఆ డబ్బును వేర్వేరు ఖాతాలకు మళ్లించి స్వాహా చేస్తారని డీసీపీ స్పష్టం చేశారు.
Also Read: Cyber Criminals: ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పట్టుబడ్డ 13 మంది సైబర్ నేరగాళ్లు
