Italy parliament members fighting eachother before speaker podium:
ఇటలీ పార్లమెంట్ బాక్సింగ్ రింగ్ గా మారింది. అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు సంయమనం కోల్పోయారు. బాధ్యత కలిగిన హోదాలలో ఉండే ఎంపీలు వీధి రౌడీలుగా మారిపోయారు. పిడిగుద్దులు..తన్నులతో ఒకరినొకరు ఘర్షణకు దిగారు. స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన ఆ ఎంపీలు చట్టసభలలో ఉండే కనీస గౌరవానికి తిలోదకాలు ఇచ్చేశారు. ఇరు వర్గాలు తగ్గేదే లే అంటూ పెద్ద ఎత్తున కొట్లాటకు దిగారు. ప్రస్తతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఆర్థిక స్వేచ్ఛ కోసం
ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార కూటమి సభలో ప్రవేశపెట్టింది. ప్రజల నుంచి సేకరించిన పన్నుల వినియోగంపై ఆయా ప్రాంతాలకు మరింత స్వేచ్ఛను ఇచ్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. దీన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో సెంటర్ – లెఫ్ట్ ఫైవ్ స్టార్ మూవ్మెంట్ ఉద్యమానికి చెందిన ఓ చట్టసభ సభ్యుడు పార్లమెంటులో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించే ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. ఈ బిల్లు కారణంగా ఇటలీలో ఉత్తర – దక్షిణ విభజన మరింత తీవ్రమవుతుందని, పేదరికంలో మగ్గుతున్న దక్షిణాది ప్రాంతాలు మరింత ఇబ్బందుల్లో పడతాయని బిల్లును వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు.
విచారం వ్యక్తంచేసిన విదేశాంగ మంత్రి
జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాధినేతలు ఇటలీకి చేరుకుంటున్న సమయంలోనే నేతలు ఇలా విచక్షణారహితంగా చట్టసభల గౌరవాన్ని మరిచి పరస్పరం దాడులకు దిగడం చర్చనీయాంశమైంది. ఘటనపై ఇటలీ విదేశాంగ మంత్రి విచారం వ్యక్తం చేశారు. తనకు మాట రావట్లేదని అన్నారు. ఇక గురువారం నుంచి శనివారం వరకూ జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు యూరోపియన్ యూనియన్, మరో ఆరు దేశాల నేతలు ఇటలీ చేరుకుంటున్నారు. ప్రధాని మోదీ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.