IRCTC Tour Package: శివుడి భక్తులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అతి తక్కువ ఖర్చుతో దేశంలోని 7 జ్యోతిర్లింగాలను దర్శించే వెసులు బాటును కల్పించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. భారత్ గౌరవ్ (Bharat Gaurav) పర్యాటక రైలు ద్వారా 7 జ్యోతిర్లింగాల దర్శనాన్ని ఐఆర్సీటీసీ కల్పించనుంది. ఒకవేళ సమయానికి డబ్బు లేకుండా ఇబ్బంది పడే వారికోసం ఈఎంఐ సౌకర్యాన్ని సైతం కల్పించడం విశేషం.
టూర్ ఎప్పుడంటే?
IRCTC పేర్కొన్న వివరాల ప్రకారం.. 7 జ్యోతిర్లింగాల యాత్ర నవంబర్ 18 – 29 మధ్య 12 రోజుల (11 రాత్రులు) పాటు సాగనుంది. యోగనగరీ ఋషికేష్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే భారత గౌరవ్ పర్యాటక రైలు (Bharat Gaurav Tourist Train) ద్వారా.. యాత్రికులు ఈ జ్యోతిర్లింగాల యాత్రను ప్రారంభించవచ్చు.
7 జ్యోతిర్లంగాలు..
ఈ ప్యాకేజీ కింద ఉజ్జయినీలోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు. అలాగే గుజరాత్ లోని ద్వారకాదీశ ఆలయం, నాగేశ్వర జ్యోతిర్లింగం, సిగ్నేచర్ వంతెన, సోమనాథ్ జ్యోతిర్లింగం చూడవచ్చు. అదే విధంగా నాసిక్ లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, పంచవటి, కాలారామ్ ఆలయం, భీమశంకర్ జ్యోతిర్లింగం, శంభాజీ నగర్ (ఔరంగాబాద్) లోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం మరికొన్ని స్థానిక ఆలయాలను ఈ టూర్ ప్యాకేజీలో కవర్ చేయవచ్చు.
ఏ స్టేషన్లలో రైలు ఎక్కవచ్చంటే?
7 జ్యోతిర్లింగాల యాత్రకు సంబంధించిన భారత గౌరవ్ రైలు.. యోగనగరీ ఋషికేశ్ (Yog Nagari Rishikesh railway station) రైల్వే స్టోషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఋషికేశ్, హరిద్వార్, మురాదాబాద్, బరేలీ, షాజహాన్పూర్, హర్దోయి, లక్నో, కాన్పూర్, ఊరై, ఝాన్సీ, లలిత్పూర్ లోనూ ఈ రైలుకు సంబంధించి స్టాప్స్ ఉన్నాయి.
టికెట్ ధరలు ఎంతంటే?
ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి టికెట్ ధరలను సైతం ఐఆర్ సీటీసీ నిర్ణయించింది. భారత గౌరవ్ రైలులో మూడు వేరియంట్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు 2 ఏసీ (2AC), 3 ఏసీ (3AC), స్లీపర్ క్లాస్ ప్రయాణం చేయవచ్చు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం – రాత్రి శాకాహార భోజనాన్ని ఐఆర్సీటీసీ అందిస్తుంది. స్థానిక దర్శనాల కోసం ఏసీ / నాన్ ఏసీ బస్సుల సదుపాయం కూడా అందుబాటులో ఉంటాయి. ఎకానమీ కేటగిరీ (స్లీపర్ క్లాస్) టికెట్ ధరను పెద్దలకు రూ.24,100గా నిర్ణయించారు. పిల్లలకు (5-11 ఏళ్లు) రూ.22,720గా ఐఆర్ సీటీసీ పేర్కొంది. అదే విధంగా స్టాండర్డ్ కేటగిరీ (3AC క్లాస్) టికెట్ ధరను రూ.40,890 కాగా చిన్నారులకు రూ.39,260గా ఉంది. సౌకర్యవంతమైన 2AC లో ప్రయాణించాలంటే పెద్దలు రూ. 54,390, పిల్లలు రూ.52,425 చెల్లించాల్సి ఉంటుంది. 3AC, 2ACలో ప్రయాణం చేసేవారికి ఏసీ హోటల్స్ లో బస, ఏసీ బస్సుల్లో ట్రాన్స్ పోర్ట్ లభించనుంది.
Also Read: Chalo Bus Bhavan: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద హైటెన్షన్.. బస్ భవన్లోకి కేటీఆర్, హరీశ్కు నో ఎంట్రీ.. పలువురు అరెస్ట్
బుకింగ్ ఎలా చేసుకోవాలి?
టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను లక్నో రైల్వే మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలియజేశారు. ఆయన ప్రకారం ఈ ప్యాకేజీపై LTC (Leave Travel Concession), EMI సదుపాయం అందుబాటులో ఉంది. ఈఎంఐ ద్వారా ట్రావెల్ చేయాలని భావిస్తే నెలకు రూ. 847/- తో ఇది ప్రారంభం కానుంది. ఐఆర్ సీటీసీలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా ఈ ఈఎంఐ వెసులుబాటును పొందవచ్చు.
