Harish Rao: రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్ కల్పించకపోవడం వల్ల వందలాది తెలంగాణ విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో మొత్తం 1,801 పీజీ సీట్లు ఉన్నాయని, వీటిలో 50 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద వెళ్తాయని, మిగిలిన 50 శాతం రాష్ట్ర కోటాలో ఉండే సీట్లలో 25 శాతం (సుమారు 450 సీట్లు) మేనేజ్మెంట్ కోటాగా ఉంటాయన్నారు.
Also Read: Gadwal District: గద్వాల జిల్లాలో సమాచార హక్కు చట్టానికి తూట్లు.. పట్టించుకోని అధికారులు
కేవలం 15% సీట్లు మాత్రమే నాన్-లోకల్ విద్యార్థులకు
అయితే ఈ సీట్లలో స్థానిక రిజర్వేషన్ అమలు చేయకపోవడంతో మొత్తం సీట్లు ఆల్ ఇండియా విద్యార్థులకు వెళ్ళిపోతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% స్థానిక విద్యార్థులకే రిజర్వేషన్ కల్పిస్తూ, కేవలం 15% సీట్లు మాత్రమే నాన్-లోకల్ విద్యార్థులకు కేటాయించిందని, ఆ విధానంతో ఆ రాష్ట్ర విద్యార్థులకు పీజీ సీట్లలో లాభం జరుగుతోందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, మన రాష్ట్ర విద్యార్థుల అవకాశాలను ఇతర రాష్ట్రాల విద్యార్థులు కొల్లగొడుతున్నారని, దీంతో 450 పీజీ సీట్లు మొత్తం ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
520 ఎంబీబీఎస్ సీట్లు
ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ విద్యార్థులు 382 సీట్లు కోల్పోతున్నారన్నారు. ఏపీ తరహాలో రిజర్వేషన్ కల్పిస్తే, ఈ 450 సీట్లలో 68 సీట్లు మాత్రమే ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయని, మిగిలిన 382 సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభిస్తాయన్నారు. కానీ ఈ రిజర్వేషన్ లేకుండా ప్రవేశాల ప్రక్రియ కొనసాగిస్తే, 382 పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులు శాశ్వతంగా కోల్పోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యలో అవకాశాలు పెంచడానికి జిల్లాల వారీగా మెడికల్ కాలేజీలను ప్రారంభించారని, స్థానిక విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అడ్మిషన్ రూల్స్లో సవరణలు చేసి, 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన కాలేజీల్లోని 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేశారన్నారు. దీంతో 520 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకు దక్కాయని తెలిపారు.
మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% స్థానిక రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలి
బి కేటగిరీ సీట్లలో 85% స్థానిక రిజర్వేషన్ వల్ల 1300 సీట్లు ప్రతి సంవత్సరం అదనంగా వచ్చాయని, మొత్తం 1,820 అదనపు ఎంబీబీఎస్ సీట్లు ప్రతి ఏటా తెలంగాణ విద్యార్థులకు లభించాయన్నారు. 20 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించినంత విలువైన ప్రయోజనం కలిగిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చిన ప్రాధాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వక పోవడం శోచనీయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర విడాలని, మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% స్థానిక రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన పీజీ ప్రవేశాల నోటిఫికేషన్ను తక్షణం రద్దు చేయాలని, కొత్త జీవో జారీ చేసి, తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను రక్షించేలా స్పష్టమైన విధానం రూపొందించాలన్నారు.
Also Read: Mahabubabad District: మానుకోట ఎన్నికల్లో కొత్త గుర్తు?.. రెండు రోజుల్లో వెలుగులోకి వచ్చే అవకాశం
