Hyderabad Crime: మేనమామ మేలు కోరుతాడంటారు. కానీ.. ఆ ఏడేళ్ల చిన్నారి పాలిన మేనమామే కాల యముడయ్యాడు. ఆస్తి గొడవల్లో క్షుద్ర పూజలు చేసి తన కూతురి మరణానికి కారణమైందని తోడబుట్టిన సోదరిపై అనుమానం పెంచుకుని ఆమె బిడ్డను దారుణంగా హతమార్చాడు. దీనికి అతని భార్య సహకరించటం గమనార్హం. మిస్సింగ్ గా నమోదైన కేసులో చాకచక్యంగా దర్యాప్తు జరిపిన మాదన్నపేట పోలీసులు బాలికను చంపిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. యాఖుత్ పురా నివాసి మీర్ సమీ అలీ (36) వాటర్ ప్లాంట్ వ్యాపారం చేస్తున్నాడు. అతని భారయ యాస్మిన్ బేగం (28). ఇదిలా ఉండగా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఓ ఇల్లును అలీ ఇటీవల తన పేరన రిజిష్టర్ చేయించుకున్నాడు. అయితే, ఆస్తిలో తనకు కూడా వాటా ఉందని సోదరి అడగటంతో ఆమెకు కొంత డబ్బు ఇచ్చిన అలీ.. మిగతా మొత్తాన్ని కూడా త్వరలోనే ఇచ్చేస్తానని చెప్పాడు. అయితే ఇవ్వాల్సిన డబ్బు మాత్రం ఇవ్వలేదు. దాంతో అన్నాచెల్లెళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే నవంబర్ లో అలీ మూడున్నరేళ్ల కూతురు అనారోగ్యంతో కన్నుమూసింది.
చెల్లెల్లిపై కక్ష పెంచుకొని..
అయితే, తన బిడ్డకు చేతబడి చేసి చెల్లెలే చంపేసిందని అనుమానించిన అలీ కక్షను పెంచుకున్నాడు. కాగా, గతనెల 30న అలీ చెల్లెలు తన కూతురు ఉమ్మెహాని సుమయా (7)తో కలిసి తల్లిని చూడటానికి అలీ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో మరోమారు తనకు ఇవ్వాల్సిన డబ్బు గురించి ప్రశ్నించింది. అప్పటికే తన బిడ్డ చావుకు ఆమే కారణమని అనుమానిస్తూ వస్తున్న అలీ ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలనుకున్నాడు. సుమయా ఆడుకుంటుండగా ఇంటి టెర్రస్ పైకి తీసుకెళ్లాడు. అక్కడ భార్యతో కలిసి చిన్నారి కేకలు పెట్టకుండా నోటికి టేప్ వేసి అతికించాడు. ఆ తరువాత రెండు చేతులను వెనక్కి విరిచి దుప్పటి, తాడుతో కట్టేశాడు. అనంతరం టెర్రస్ పై ఉన్న ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ లోకి సుమేయాను విసిరేసి హతమార్చాడు. ఆ తరువాత అలీ, యాస్మిన్ బేగంలు తమకేమీ తెలియదన్నట్టుగా కిందకు వచ్చారు.
దుప్పటి ముక్క ఆధారంగా..
కాగా, కూతురు కనిపించకుండా పోవటంతో సుమయా తల్లి పరిసరాలు మొత్తం గాలించింది. అయినా, ఆచూకీ తెలియకపోవటంతో మాదన్నపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ పీ.ఆంజనేయులు విచారణ చేపట్టారు. సుమేయా కనిపించకుండా పోయిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. చివరకు ఇంటి డాబాపై ఉన్న ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ లో సుమేయా మృతదేహం కనిపించింది. దర్యాప్తులో సుమేయా చేతులు కట్టటానికి ఉపయోగించిన దుప్పటి ముక్క అలీ ఇంట్లోనిదేనని వెల్లడైంది.
Also Read: Sama Ram Mohan Reddy: ‘హరీష్ రావుకు అరుదైన వ్యాధి ఉంది’.. కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్
నేరాన్ని అంగీకరించిన నిందితుడు
సుమేయా హత్య తరువాత అలీ భార్య యాస్మిన్ బేగంను వెంటబెట్టుకుని యాఖుత్ పురా చంద్రానగర్ లోని అత్తవారింటికి వెళ్లినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో చంద్రానగర్ వెళ్లిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అలీ, యాస్మిన్ బేగంలు తామే పథకం ప్రకారం సుమేయాను హత్య చేసినట్టుగా అంగీకరించారు. ఈ మేరకు ఇద్దరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోసం జైలుకు పంపారు.
