Cough Syrup Deaths: కేసన్స్ ఫార్మా అనే కంపెనీ రాజస్థాన్లోని జైపూర్ కేంద్రంగా ఉత్పత్తి చేస్తున్న ‘డెక్స్ట్రోమెథార్ఫాన్ హైడ్రోబ్రోమైడ్’ అనే దగ్గు సిరప్ చిన్నారులకు ప్రాణాంతకంగా (Cough Syrup Deaths) మారింది. రాజస్థాన్లోని సీకర్ జిల్లాలో ఐదేళ్ల బాలుడు బుధవారం చనిపోయాడు. ప్రభుత్వ ఉచిత ఔషధ పంపిణీ పథకం కింద అందించిన ఈ సిరప్ తాగిన తర్వాత బాలుడు మరణించాడు. అదే సిరప్ తాగిన మరో ముగ్గురు పసిపిల్లలు కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రాష్ట్రంలో ఈ సిరప్ తాగి గత రెండు వారాల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరో 10 మందికిపైగా పిల్లలు అనారోగ్యానికి గురయ్యారని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్లో కూడా ఇదే తరహాలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సిరప్ సురక్షితమైనదేనని నిరూపించేందుకు ఒక డోస్ తాగిన వైద్యుడు కూడా స్పృహ తప్పాడని, ఆయన 8 గంటలపాటు కారులోనే ఉన్నా ఎవరూ గుర్తించలేకపోయారని అంటున్నారు. ఈ సిరప్లో ఉండే డెక్స్ట్రోమెథార్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ రసాయనం కొన్ని బ్యాచ్ల్లో హానికర స్థాయిలో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం పౌరులకు ఉచితంగా ఔషధాలు పంపిణీ చేస్తున్న పథకానికి కేసన్స్ ఫార్మా మందులు సప్లయ్ చేస్తోంది.
Read Also- DGP Shivdhar Reddy: స్థానిక సంస్థల ఎన్నికలే నా మొదటి ఛాలెంజ్: డీజీపీ శివధర్ రెడ్డి
హానికరమైన ఈ సిరప్పై రాజస్థాన్ మెడికల్ సర్వీస్ కార్పొరేషన్ లిమిటెడ్కు (RMSCL) ఫిర్యాదులు అందాయి. సెప్టెంబర్ 28, 29 తేదీలలో జిల్లా వైద్య శాఖ అధికారుల నుంచి కేఎల్-25/147, కేఎల్-25/148 బ్యాచ్లపై ఫిర్యాదులు అందాయని అధికారులు వెల్లడించారు. దీంతో, ఈ బ్యాచ్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసి, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు ఆర్ఎంఎస్సీఎల్ అధికారులు వెల్లడించారు. కాగా, అధికారిక గణాంకాల ప్రకారం, జూన్ నెల నుంచి ఇప్పటివరకు ఈ సిరప్ను 1.33 లక్షల మంది పిల్లలకు పంపిణీ చేశారు. అయితే, మరణాల కేసులు నమోదయ్యే వరకు ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. అయినప్పటికీ, తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా సిరప్ పంపిణీని రాజస్థాన్ ప్రభుత్వం నిలిపివేసింది. దగ్గు సిరప్ను కూడా ముందస్తు జాగ్రత్త కోసం మళ్లీ పరీక్షకు పంపించారు.
Read Also- DA increase 2025: దసరాకి ఒక్క రోజు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
మధ్యప్రదేశ్ వెళ్లిన కేంద్ర బృందం
దగ్గుమందు చిన్నపిల్లలకు హానికరంగా మారినట్టుగా ఫిర్యాదులు నమోదు కావడంతో జాతీయ రోగ నియంత్రణ కేంద్రం (NCDC) బృందం రంగంలోకి దిగింది. మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లాలో ఇటీవల చిన్నపిల్లల మరణాలు నమోదు, పలువురు అనారోగ్యం బారినపడడంతో దర్యాప్తు కోసం కేంద్ర బృందం అక్కడికి వెళ్లింది. దగ్గు సిరప్ నమూనాలు సేకరించింది. కాగా, మధ్యప్రదేశ్లో కూడా డెక్స్ట్రోమెథార్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సిరప్ బ్యాచ్లకు అత్యవసర పరీక్షలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిరప్ల పంపిణీని నిలిపివేశారు. రెండు రకాల దగ్గు సిరప్లు సేవించిన కొందరు పిల్లల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది. పలువురు చిన్నారులు చనిపోయారు కూడా. దీంతో, ఛింద్వారా జిల్లా పాలనాధికారులు కొల్డ్రిఫ్, నెక్స్ట్రో-డీఎస్ సిరప్లపై నిషేధం విధించారు.