Local Body Elections: స్థానిక ఎన్నికల్లో (Local Elections) ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తుండటంతో గ్రామ స్థాయిలో పోటీదారుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక షెడ్యూల్ ఎప్పుడైనా వస్తుందన్న సమాచారం ఆశావా హుల్లో ఆశలు రేకెత్తిస్తుండగా మరోవైపు తమకు రిజర్వేషన్ తమకు అదృష్టం వరిస్తుందో లేదోనని లోలోన మదన పడుతున్నారు. జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాలో ఏ గ్రామం నుంచి వార్డు సభ్యుడిగా, సర్పంచ్ గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా గెలుపొందినా మంచి పలుకుబడి ఉంటుందని భావిస్తున్నారు.\
స్థానిక ఎన్నికల్లో గెలుపొందితే తమ ప్యూచర్ కూడా మారుతుందని ఆశలపల్లకిలో ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు. జిల్లాలో మొత్తం 255 గ్రామపంచాయతీ ఉండగా అందులో 2990 వార్డులు ఉన్నాయి. 3,934218 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 193827, మహిళలు 1,99.781, ఉండగా థర్డ్ జెండర్ 10 మంది ఉన్నారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, 13 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆశావహులు గ్రామాల్లో బరిలో నిలిచి పదవులు దక్కించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ తేలితే రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పరిస్థితి వస్తుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు ఇతర రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల ప్రక్రియపైనే దృష్టి పెట్టాయి.
Also Read: Amazon Offers: అమెజాన్ బంపరాఫర్.. తక్కువ ధరకే బెస్ట్ ల్యాప్ టాప్స్.. అస్సలు మిస్ అవ్వకండి!
ఆశావహుల టెన్షన్.. పల్లెల్లో ఎన్నికల సందడి
రెండేండ్లుగా ఊరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కార్ ప్రయత్నాలు చేస్తుండడంతో ఆశావహుల్లో ఒకింత ఆందోళన.. మరోవైపు ఆశలు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. నేడో రేపో రిజర్వేషన్లు ప్రకటించి.. రెండు, మూడు రోజుల్లో ఎంపీటీసీ, జడ్సీటీసీ షెడ్యూల్.. ఆ వెంటనే పంచాయతీల షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు షెడ్యూల్ వస్తే పోటీలో ఉండడానికి కొందరు పై అంటుండగా.. మరికొందరు నై అంటున్నారు. యూరియా కొరత, పింఛన్ల పెంపు తరహా సమస్యలు అధికార పార్టీ నేతలను కలవర పెడుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని బీఆర్ఎస్, బీజేపీ,వామపక్ష నేతలు ఆశతో ఉన్నారు. ఏ గ్రామం నుంచి వార్డు సభ్యుడిగా, సర్పంచ్, ఎంపీటీసీగా లేదా జెడ్పీటీసీగా గెలిస్తే స్థానికంగా మంచి పలుకుబడి ఉంటుందని యువత ఆశిస్తోంది.
రాజకీయ పార్టీల్లో రిజర్వేషన్ల టెన్షన్
స్థానిక పోరు పల్లెల్లో సందడి తీసుకొస్తే ఆశా వహుల్లో, రాజకీయ పార్టీల్లో రిజర్వేషన్ల టెన్షన్ మొదలైంది. హైకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్ చివరి వారంలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించే విధంగా అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఇదే క్రమంలో రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయనే చర్చ గ్రామాల్లో ప్రధానంగా నడుస్తోంది. గ్రామపంచాయతీలో పాలకవర్గాల పదవీకాలం 2024 ఫిబ్రవరి మొదటి వారంతో ముగిసింది. మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం జూలైలో ముగిసింది.
ఈ ఏడాది జనవరి నెలాఖరులో మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ప్రభుత్వం కసరత్తులు చేస్తుండడంతో రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు వార్డు, సర్పంచ్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గోప్యత పాటించడంతో ఆశావహుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. చివరి వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని సంకేతాలు రావడంతో ఆశావహుల్లో కలవరం, ఉత్సాహం కలగలిపి కనిపిస్తోంది. దీంతో జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ఉండబోతుందనే దానిపై పల్లెల్లో చర్చ సాగుతోంది.
యువత చూపు రాజకీయం వైపు
భవిష్యత్తు రాజకీయాలకు మార్గం సుగమమవుతుందని యువ ఆశావహులు భావిస్తున్నా…. రిజర్వేషన్లు తమకు కలిసొస్తాయో లేదోనన్న అనుమానమే వారిని నిద్రపోనివ్వడం లేదు. గత రెండేళ్లుగా ఎన్నికలు ఎప్పుడొస్తాయోనన్న ఉత్కంఠతో ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలపై లక్షల్లో ఖర్చు చేసిన వారు ఇప్పుడు కొత్త ఆందోళనను ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కసరత్తు చేస్తుండటంతో పల్లెల్లో బీసీ వర్గాల్లో కొత్త ఉత్సాహం చెలరేగుతోంది. ఈ ఎన్నికలలో బీసీలు కీలకపాత్ర పోషించబోతున్నారని స్థానిక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జిల్లాలో బీసీ రిజర్వేషన్లను అందిపుచ్చుకొని స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించాలనే తపన యువతలో మెండుగా ఉంది. 2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ బీసీలో పోటీపడి ఉన్నత సామాజిక వర్గాల పెద్దలపై గెలుపొందారు.
భవిష్యత్తు రాజకీయాల్లో బలమైన స్థానం సంపాదించాలి
ప్రస్తుతం సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాబోయే రిజర్వేషన్లను అందిపుచ్చుకోవడంతో పాటు జనరల్ స్థానాల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. బీసీ డిజర్వేషన్ల కోటాను చట్టబద్దంగా పెంచేందుకు చిక్కుముడులు ఉండడంతో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ సారి బీసీలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయనే ఆశలు మాత్రం పెరిగాయి. రిజర్వేషన్లు పెరుగుతాయన్న అంచనాలు బీసీ వర్గాల్లో మరింత చైతన్యం నింపాయి. స్థానిక సంస్థల్లో అధిక సంఖ్యలో స్థానాలు సాధించి భవిష్యత్తు రాజకీయాల్లో బలమైన స్థానం సంపాదించాలని బీసీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర సామాజిక వర్గాలు కూడా తమ శక్తిని నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నాయి.
ఎవరికి అదృష్టం కలిసివస్తుందో?
మరోవైపు ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు కూడా రిజర్వేషన్లలో తాము ఎక్కువ స్థానాలు సాధించాలని ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ తేలితేనే పార్టీల అభ్యర్థుల ఖరారుకు స్పష్టత వస్తుంది. ఎవరికి రిజర్వేషన్ అనుకూలిస్తే వారు బరిలో ఉంటారు. ఎవరికి అనుకూలించకపోతే నిరాశ తప్పదు. అయినా సరే ఎన్నికల పర్వం గ్రామాల్లో రాజకీయ ఉత్సాహాన్ని పెంచింది. ఎవరికి అదృష్టం కలిసివస్తుందో, ఎవరికి నిరాశ మిగులుతుందో రానున్న రోజులు చెప్పనున్నాయి. మరి రిజర్వేషన్లు ఎవరికి అనుకూలిస్తాయో.. ఎవరికి నిరుత్సాహం మిగిలిస్తుందోనని ఆశావాహలో వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Also Read: Norma Movie: అత్తతో అల్లుడి రహస్య బంధం.. ఊపేస్తున్న సినిమా.. సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్!