Digital Arrest: యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పేరిట వృద్ధుడి టార్గెట్
పహల్గాం దాడితో సంబంధం ఉందంటూ బెదిరింపులు
రూ.26 లక్షలు కొల్లగొట్టిన సైబర్ క్రిమినల్స్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఎన్ఐఏ అధికారులమంటూ చెప్పి, పహల్గామ్ ఉగ్రనరమేధం కేసుతో సంబంధం ఉందంటూ సైబర్ క్రిమినల్స్ ఓ వృద్ధుడిని బెదిరించారు. డిజిటల్ అరెస్ట్ (Digital Arrest) పేరిట ఏకంగా రూ.26 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది. హుమాయున్ నగర్ ప్రాంతానికి చెందిన 68 ఏళ్ల వృద్ధునికి ఇటీవల అపరిచిత వ్యక్తి నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారినని చెప్పుకున్నాడు. ఆ తరువాత పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడితో సంబంధం ఉన్నట్టుగా తమ విచారణలో తేలిందని వృద్ధుడిని బెదిరించాడు. ఉగ్రవాదులకు మనీ లాండరింగ్ ద్వారా డబ్బు పంపించినట్టుగా ఆధారాలు దొరికాయని భయపెట్టాడు. ఈ క్రమంలో అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయ్యాయని ఫోర్టరీ చేసిన వారెంట్లను చూపించాడు.
Read Also- Bathukamma Record: గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లక్ష్యంగా బల్దియా ‘బతుకమ్మ’ వ్యూహం
ఎన్ఐఏ అధికారులు కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారని, అరెస్ట్ చేయటం ఖాయమని సైబర్ క్రిమినల్స్ బెదరగొట్టారు. అలా జరగకుండా ఉండాలంటే అకౌంట్లో ఉన్న డబ్బును తాము చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేయాలని చెప్పారు. బ్యాంక్ అకౌంట్ల కూడా వివరాలు చెప్పాలన్నారు. వెరిఫికేషన్ చేసిన తరువాత డబ్బు వాపస్ చేస్తామని నమ్మించారు. దాంతో తీవ్రంగా భయపడ్డ వృద్ధుడు మొదట తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న 6 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను క్లోజ్ చేసి ఆ డబ్బును ఆగంతుకుడు చెప్పినట్టుగా హెంట్రీ జోన్స్ పేరిట ఉన్న అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తరువాత తన భార్య ఖాతాలో ఉన్న మరో 20 లక్షల రూపాయలను కూడా అదే అకౌంట్కు బదిలీ చేశాడు. దాంతో కుటుంబ సభ్యులకు విషయం తెలిసిందే. ఏమైందని ప్రశ్నించగా బాధితుడు చెప్పిన విషయాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు సైబర్ మోసగాళ్లు చేసిన పని అని నిర్ధారించుకుని, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also- IND vs BAN Clash: రేపే మ్యాచ్.. టీమిండియాపై బంగ్లాదేశ్ కోచ్ షాకింగ్ కామెంట్స్
హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: పాతబస్తీ యాఖుత్ పురాకు చెందిన 32 ఏళ్ల మహిళ ఈనెల 14న హత్యకు గురైంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు ఆటోలు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురూ పాత నేరస్తులేనని చెప్పారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీనివాస తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పాతబస్తీ యాఖుత్ పురాకు చెందిన 32 ఏళ్ల మహిళ ఈనెల 14న అత్తాపూర్ రోడ్డు పిల్లర్ నెంబర్ 143 వద్ద మద్యం సేవించిన మత్తులో ఉండటాన్ని వృత్తిరీత్యా కారు డ్రైవర్, లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ నివాసి దుర్గారెడ్డి గమనించాడు. ఆమెకు ఓ బీరు, బిర్యానీ ఇప్పించి తనతోపాటు శాతంరాయి ప్రాంతంలోని కేఎల్ సీసీ ఫంక్షన్ హాల్ వద్దకు తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశంలో తన కోరిక తీర్చాలని ఆమెపై దాడి చేశాడు. బాధితురాలు ఎదురు తిరగటంతో ఆమెను ఆరాంఘర్ చౌరస్తా వద్ద 306 నెంబర్ పిల్లర్ వద్ద విడిచి పెట్టి వెళ్లిపోయాడు. ఆ సమయంలో హకీంపేట నివాసి, ఆటోడ్రైవర్ అయిన గులాం దస్తగిరి ఖాన్ అలియాస్ రెహాన్ అలియాస్ ఫైవ్ స్టార్ (26), అతడి స్నేహితుడు, టోలీచౌకీ పారామౌంట్ కాలనీ నివాసి, ఆటోడ్రైవర్ అయిన మహ్మద్ ఇమ్రాన్ (25) తమ తమ ఆటోలతో అక్కడే ఉన్నారు. మద్యం సేవించిన మత్తులో ఉన్న మహిళను గమనించి తమ ఆటోలోకి ఎక్కించుకుని కిస్మత్ పూర్ బ్రిడ్జీ వద్దకు తీసుకెళ్లారు. బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. బాధితురాలు ఎదురు తిరగటానికి ప్రయత్నించగా కర్రతో ఆమె మర్మావయవాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి హతమార్చారు. ముగ్గురు నిందితులను గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.