Cockpit Door: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో షాకింగ్ ఘటన జరిగింది. సోమవారం బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్న విమానం గాల్లో ఉండగా ఓ ప్యాసింజర్ కాక్పిట్ (పైలట్లు కూర్చొనే భాగం) డోర్ తెరవడానికి (Cockpit Door) ప్రయత్నించాడు. సదరు ప్యాసింజర్ కాక్పిట్ డోర్ను టాయిలెట్ డోర్ అనుకొని తప్పుగా తెరిచే ప్రయత్నం చేశాడని ఎయిరిండియా తెలిపింది. ఈ ఘటన సోమవారం (సెప్టెంబర్ 22) జరిగినట్టు వెల్లడించింది. ఆ ప్యాసింజర్ పేరు మణి అని సిబ్బంది గుర్తించారు. కాక్పిట్ డోర్ తెరిచేందుకు ఎంటర్ చేయాల్సిన సెక్యూరిటీ కోడ్ను తప్పుగా టైప్ చేశాడు. దీంతో, కాక్పిట్లో ఉన్న విమాన సిబ్బందికి అలర్ట్ వెళ్లింది. హైజాక్ ప్రయత్నమేమో అని అనుమానించిన పైలట్ పైలెట్లు డోర్ తెరవలేదు. వెంటనే ఏటీసీకి (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) సమాచారం కూడా అందించాడు. సదరు ప్యాసింజర్ను కాక్పిట్లోకి ప్రవేశాన్ని నిరాకరించారు. ఈ ఘటన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఐఎక్స్-1086 ఫ్లైట్లో జరిగింది.
విమానం ల్యాండింగ్ అయిన వెంటనే నిందిత ప్యాసింజర్ మణి పాటు అతడితో కలిసి ప్రయాణించిన మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. విమానం వారణాసిలో ల్యాండ్ అయిన ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించారు. నిందిత ప్యాసింజర్ మణి మాట్లాడుతూ, ఇది తనకు మొదటి విమాన ప్రయాణమని చెప్పాడు. కోడ్ సిస్టమ్ గురించి తెలియదని, టాయిలెట్ డోర్ అనుకొని ఓపెన్ చేసినట్టు వివరించాడు.
స్పందించిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్
ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. తాము పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని, వాటి విషయంలో ఎలాంటి రాజీ లేదని తెలిపింది. విమానం ల్యాండింగ్ అయిన వెంటనే ఈ వ్యవహారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశామని, ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని వివరించింది. విమానంలో కాక్పిట్ డోర్ను తెరవడానికి ప్రయత్నించిన ప్యాసింజర్ని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారులకు అప్పగించామని వెల్లడించింది.
Read Also- Bathukamma Festival: శ్రీ చైతన్య పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. స్త్రీల సాంప్రదాయానికి ప్రతీక
బోర్డింగ్ పాస్ స్కాన్ చేసి విమానం ఎక్కలేదు
ఆదివారం లండన్ నుంచి ఢిల్లీకి వెళ్లిన విమానం టేకాఫ్కు ముందు ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు బోర్డింగ్ పాస్ స్కాన్ చేసి విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. కానీ, సదరు ప్యాసింజర్ విమానం ఎక్కలేదని సిబ్బంది గుర్తించారు. దీంతో, విమానం టేకాఫ్ ఏకంగా 2 గంటలు ఆలస్యమైంది. ఆ వ్యక్తి విమానం ఎక్కకుండా, తిరిగి ఆరైవల్స్ ఏరియాకి వెళ్లిపోయినట్టు గుర్తించారు. చివరికి అతడిని గుర్తించి బోర్డింగ్ ఏరియాకి తీసుకెళ్లారు. అందుకోసం మళ్లీ గేట్ తెరిచి అతడిని తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ అంతరాయం కారణంగా విమానం రెండు గంటలపాటు ఆలస్యమైంది.