Rahul Gandhi: ‘ఓటు చోరీ’ ఆరోపణల పరంపరలో భాగంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఇచ్చిన పవర్పాయింట్ ప్రజెంటేషన్లోని ఒక వీడియో క్లిప్ను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. 37 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో క్లిప్, ఓటు చోరీ జరిగిందనడానికి ‘ 100 శాతం బుల్లెట్ప్రూఫ్ ఎవిడెన్స్’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 2022 డిసెంబర్ 19న తెల్లవారుజామున 4 గంటలకే ఎవరో ఓటర్ల జాబితాలోని 2 పేర్లను తొలగించేందుకు ఫామ్స్ను ఓపెన్ చేసి, వివరాలు నింపి, సమర్పించారని రాహుల్ గాంధీ అన్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి వారికి కేవలం 36 సెకన్ల సమయం మాత్రమే పట్టిందని రాహుల్ గాంధీ చెప్పడం ఆ వీడియోలో కనిపించింది. ‘‘ఉదయం 4 గంటలకే లేచి, 36 సెకన్లలో ఇద్దరు ఓటర్లను డిలీట్ చేయండి, మళ్లీ వెళ్లి నిద్రపోండి. ఓట్ల దొంగతనం ఈ విధంగా జరిగింది!. ఎన్నికల సంఘం మేల్కొనే ఉంది. దొంగతనాన్ని గమనిస్తూ, దొంగలను కాపాడుతోంది’’ అని రాహుల్ గాంధీ ఎక్స్లో రాసుకొచ్చారు.
Read Also- Bunny Vasu reaction: బండ్లన్నకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన బన్నీవాస్.. అప్పుడే ఆయన స్టార్ అయ్యారు
బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్లు..
రాహుల్ గాంధీ ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం ఖండించారు. ఎన్నికల కమిషన్ను, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో వరుస పరాజయాలు ఎదుర్కొందని, అందుకే రాహుల్ గాంధీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. భారత యువత ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తోందని, రాహుల్ గాంధీ ఈ వాస్తవాన్ని అంగీకరించాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు ఎదురవుతున్న వరుస ఓటముల తర్వాతే భారత ప్రజాస్వామ్య వ్యవస్థను దుర్వినియోగం చేశారంటూ రాహుల్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ‘‘రాహుల్ గాంధీ మాట్లాడితే దేశం నమ్మదు. పేదలు, రైతులు, సాధారణ ప్రజలు మోదీని వారి నాయకుడిగా చూస్తున్నారు’’ అని రిజిజు వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఓడిపోయాక రాహుల్ గాంధీ తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు వ్యవస్థను తప్పుబడితే, దానిని ఎవరూ అంగీకరించబోరని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. దేశం మారిందని, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ పురోగమిస్తోందని ఆయన అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఇంజిన్ను రాహుల్ గాంధీ వంటి వారు ఆపాలని చూస్తున్నారతీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read Also- Post Office vs Bank: పోస్టాఫీస్ వర్సెస్ బ్యాంక్.. మీ డబ్బును ఎందులో డిపాజిట్ చేస్తే బెటర్!
కాగా, రాహుల్ గాంధీ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటక ఓటర్ల జాబితాలోని ఓటర్లను ఓటర్లను తప్పుడు లాగిన్లు ఉపయోగించి, ఇతర రాష్ట్రానికి చెందిన ఫోన్ నెంబర్లతో తొలగించారని ఆరోపించారు. ఈ ప్రక్రియ ఒక ‘సెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్’ ద్వారా జరిగిందని అన్నారు. అందుకు ఉదాహరణగా కర్ణాటకలోని ఆలంద్ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపు వివరాలను చూపించారు. ఈ ఆరోపణలపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించింది. 6,018 మంది ఓటర్ల పేర్లు తొలగింపుపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ఓట్ల దొంగతనంతో ఓటమి పాలయ్యామని కాంగ్రెస్ చెబుతోందని, కానీ, ఆలంద్ నియోజకవర్గంలో గెలిచింది కాంగ్రెస్ పార్టీయేనని, బీజేపీ కాదని ఎన్నికల సంఘం గుర్తు చేసింది.