Supreme Court: దేశవ్యాప్తంగా భారీ నిరసనలు రేపిన వక్ఫ్ (సవరణ) చట్టం-2025లోని కొన్ని నిబంధనలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చట్టంలోని కొన్ని అంశాలు అధికార దుర్వినియోగానికి దారి తీయవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. అదే సమయంలో పిటిషనర్లు కోరుకుంటున్నట్లుగా చట్టం అమలుపై స్టే విధించాల్సిన అవసరం లేదని సుప్రీం తేల్చి చెప్పింది.
‘స్టే అవసరం లేదు’
ఈ ఏడాది ఏప్రిల్ లో పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం – 2025 (Waqf Amendment Act 2025) వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయ్ (CJI BR Gavai), జస్టిస్ ఏ.జి. మసీహ్ (Justice AG Masih)తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘మొత్తం చట్టాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి లేదు. కానీ కొన్ని నిబంధనలకు తాత్కాలిక రక్షణ అవసరం’ అని అభిప్రాయపడింది.
కలెక్టర్ అధికారాలపై ఆంక్షలు
కొత్త సవరణ చట్టంలో కలెక్టర్కు వక్ఫ్ ఆస్తులపై తుది నిర్ణయం చెప్పే అధికారాన్ని కల్పించారు. అయితే దీనిని నిలిపివేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మసనం స్పష్టం చేసింది. ‘కలెక్టర్ వ్యక్తిగత పౌరుల హక్కులపై తీర్పు చెప్పలేడు. ఇది అధికార విభజన సూత్రానికి వ్యతిరేకం. ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే వరకు మూడో పక్షం హక్కులు సృష్టించరాదు. కలెక్టర్కు ఇస్తున్న ఈ అధికారాలపై ఉన్న నిబంధన తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది’ అని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.
సభ్యత్వ పరిమితి
మరోవైపు వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ముస్లిమేతరులను నియమించే నిబంధనపై కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పరిమితులు విధించింది. వక్ఫ్ బోర్డులో మూడు కన్నా ఎక్కువమంది ముస్లింకాని సభ్యులు ఉండకూడదని షరతు విధించింది. అలాగే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో నలుగురు కన్నా ఎక్కువమంది ముస్లింకాని సభ్యులు ఉండకూడదని పేర్కొంది. అలాగే ఒక వ్యక్తి వక్ఫ్ను సృష్టించడానికి 5 సంవత్సరాలు ఇస్లాం మతాన్ని ఆచరించే వ్యక్తిగా ఉండాలన్న వక్ఫ్ సవరణ చట్టం 2025లోని నిబంధనను
కూడా నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి షరతుకు ఎలాంటి స్పష్టమైన పద్ధతి లేకపోవడం వల్ల అధికారం దుర్వినియోగానికి కారణం కావొచ్చని అభిప్రాయపడింది. కాబట్టి ఒక వ్యక్తి ఇస్లాం మతాన్ని ఆచరించేవాడో కాదో నిర్ణయించడానికి.. రాష్ట్ర ప్రభుత్వాలు నియమాలను రూపొందించే వరకు ఈ నిబంధన నిలిపివేయబడుతుందని కోర్టు పేర్కొంది.
Also Read: Donald Trump: తల నరికి భారతీయుడి హత్య.. ట్రంప్ రియాక్షన్ చూశారా.. అస్సలు ఊహించలేరు!
వివాద నేపథ్యం
వక్ఫ్ చట్టం-1995కు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టానికి ఈ ఏడాది ఏప్రిల్ లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆపై రాష్ట్రపతి సైతం ఈ బిల్లుపై సంతకం చేశారు. అయితే ఈ సవరణలపై దేశవ్యాప్తంగా ముస్లిం సంస్థలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకునే కుట్రగా అభివర్ణించాయి. అయితే కేంద్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. వక్ఫ్ ఆస్తులపై భారీ వివాదాలు, ఆక్రమణలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకే ఈ కొత్త చట్టం తెచ్చామని స్పష్టం చేసింది.