Viral Video: దిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి రోడ్లపై విపరీతంగా ట్రాఫిక్ జాబ్ (Traffic Jam) ఏర్పడుతోంది. ముఖ్యంగా దిల్లీ -ఎన్సీఆర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించిపోతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి రోడ్లపైనే గడుపుతున్నారు. ఈ క్రమంలోనే గురుగ్రామ్ – దిల్లీ హైవేపై కూడా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో చిర్రెత్తుకొచ్చి ఓ వ్యక్తి.. తన స్కూటీని భూజాలపై మోసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వీడియోలో ఏముందంటే?
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి స్కూటీని భుజాలపై పెట్టుకొని ఆగి ఉన్న వాహనాల మధ్య నుంచి వెళ్తూ కనిపించాడు. మరొక వ్యక్తి అతడికి సాయం చేయడం కూడా వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ‘గురుగ్రామ్ ట్రాఫిక్కి ఒక్కటే సొల్యూషన్. ఇక ఇదే చేయాలి’ అని ఓ నెటిజన్ క్యాప్షన్ పెట్టాడు. పోస్ట్ చేసిన కొద్ది సేపటికే ఈ వీడియో ట్రెండింగ్ గా మారడం విశేషం.
View this post on Instagram
నెటిజన్ల రియాక్షన్స్
స్కూటర్ ను మోసుకెళ్తున్న వీడియోను చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ ‘కొత్త బిజినెస్ ఐడియా. బైక్ ఎత్తుకొని మరో వైపు పెట్టడం. ఛార్జ్ రూ.500’ అని పేర్కొన్నారు. ఇంకొకరు ‘4/6/8 చక్రాల వాహన యజమానులకు మరింత శక్తి, ఎనర్జీ అసవరం. అప్పుడు వారు కూడా ఇంటికి చేరగలరు’ అని ఫన్నీగా రాసుకొచ్చారు. ‘ఇండియా బిగినర్స్కి కాదు’ అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టారు. ‘కొత్త బాహుబలి వచ్చేశాడు’ అంటూ ఇంకొకరు పేర్కొన్నారు. మెుత్తంగా ఈ వీడియోకు నెటిజన్లు ఇస్తున్న క్యాప్షన్స్ మరింత నవ్వులు పూయిస్తోంది.
వాతావరణ శాఖ వార్నింగ్..
ఇదిలా ఉంటే దిల్లీకి భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాజధానిలోని మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. మరోవైపు హరియాణా, చండీగఢ్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ (సెప్టెంబర్ 4) భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Also Read: Ireland Permanent Residency: భారత్ బోర్ కొట్టిందా.. ఐర్లాండ్ బంపరాఫర్.. రూ.52 వేలతో లైఫ్లాంగ్ హ్యాపీగా..!
దిల్లీలో వచ్చే 3 రోజులు వర్షాలే!
దిల్లీలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సెప్టెంబర్ 3 మధ్యాహ్నం ఒంటి గంటకు నీటి మట్టం 207 మీటర్ల ఎత్తు వరకు పెరిగింది. వాతావరణ సూచన ప్రకారం దిల్లీలో ఇవాళ కూడా పిడుగులతో కూడిన వర్షం కురవనుంది. సెప్టెంబర్ 5న మోస్తరు వర్షాలు, 6న పిడుగులతో కూడిన వర్షం, 7-8 తేదీల్లో సాధారణ మేఘావృత వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది.