MLC Kavitha On CM Revanth: రైతులు, పేదలపై సీఎంకు ఎందుకింత పగ అని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ప్రశ్నించారు. కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకం భూసేకరణ కోసం ఇంతటి దుర్మార్గం ఎందుకు? అని నిలదీశారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి కానుకుర్తి గ్రామంపైకి పోలీసులను పంపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారా? అని మండిపడ్డారు. మొన్న లగచర్లలో బంజారా ఆడబిడ్డలపై కాంగ్రెస్(Congress) ప్రభుత్వం సాగించిన అఘాయిత్యాలనే కానుకుర్తి ప్రజలపై కొనసాగిస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిరంకుశ చర్యలకు స్థానం లేదనే విషయం గుర్తించాలన్నారు. మీ డ్రీమ్ ప్రాజెక్టు కోసం ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. ఇదివరకే కానుకుర్తి ప్రజలకు అండగా నిలిచాం.. ఇకముందు కూడా వారి పక్షాన పోరాటంలో ముందే ఉంటామని హెచ్చరించారు.
Also Read: Crime Influence: కరుడుగట్టిన నేరస్తులు మించి హత్యలు.. ఇంతకీ ఎవరతడు..?
కల్యాణలక్ష్మీకి తూట్లు
పేదింటి ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దన్న సదుద్దేశంతో కేసీఆర్(KCR) ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మీ పథకానికి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. నెలల తరబడి కళ్యాణలక్ష్మీ దరఖాస్తులు కూడా పరిశీలించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లోనే 61 వేలకుపైగా, అర్హత నిర్దారణ స్థాయిలో 21 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయంటే పేదల సంక్షేమం పై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో స్పష్టమవుతున్నదన్నారు. ఎన్నికలకు ముందు పేదలు, ఆడబిడ్డలకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. కళ్యాణలక్ష్మీలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని నమ్మించి నయవంచన చేసిందన్నారు. కనీసం దరఖాస్తులు కూడా పరిశీలించకుండా క్రమేణా కళ్యాణలక్ష్మీని కనుమరుగు చేసే కుట్రకు తెరతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: New Ration Cards: తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఏటా రూ 18వేలు ఆదా..?