Seethakka: రాష్ట్రంలో ఎక్కడికక్కడ వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, తాను కూడా నిజాంబాద్ కామారెడ్డి జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన సూచనలు ఇచ్చినట్టు నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క చెప్పారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కామారెడ్డిలో గోడ కూలి ఇద్దరు మరణించారని, ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. గాంధీభవన్లో మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
కేటీఆర్ పై ఫైర్..
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్(KTR) చేసిన విమర్శలపైనా మంత్రి సీతక్క స్పందించారు. బీఆర్ఎస్(Brs) జాతీయ పార్టీ కాకపోయినా.. కేటీఆర్(KTR) దేశమంతా తిరిగారని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల కోసం మీలాగా సీఎం రేవంత్ రెడ్డి పని చేయ లేదని అన్నారు. మీ తండ్రి లెక్క రేవంత్ ఫార్మ్హౌస్ సీఎం కాదని స్పష్టం చేశారు. తమ ముఖ్యమంత్రి ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటారని, ఫామ్హౌస్లో కూర్చుని కాలక్షేపం చేయరనీ సీతక్క ఎద్దేవా చేశారు. బీజేపీకి కేటీఆర్కు మైత్రి ఉందన్న విషయం మరోమారు బయటపడిందని సీతక్క అన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా తాము బీహార్ వెళ్ళాం కాబట్టి కేటీఆర్కి బాధ అయ్యిందని అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బహిరంగంగా మద్దతు ఇస్తోందని, అందుకే బీజేపీ అక్రమాలు బయటపడితే బీఆర్ఎస్ ఎక్కువగా ఆందోళన చెందుతోందని వ్యాఖ్యానించారు. అందుకే రాహుల్ గాంధీ యాత్ర పై బీఆర్ఎస్ ఉలిక్కి పడుతుందని విమర్శించారు. ‘బీహార్ వెళ్లి రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చాం. బీజేపీకి వ్యతిరేకంగా మా నాయకుడు పోరాటం చేస్తున్నాడు. మేము ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చాం. అప్పటికి రాష్ట్రంలో వర్షం లేదు. ఏది పడితే అది మాట్లాడటం కేటీఆర్కి అలవాటే అని సీతక్క విమర్శించారు.
బీజేపీ ఓటు హక్కును కాలరాస్తోంది
రాహుల్ గాంధీ చేపట్టిన బీహార్ యాత్ర గురించి మాట్లాడిన ఆమె, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన పోరాటం చేస్తున్నారని, దానికి మద్దతుగా తాము వెళ్లడం తప్పేం కాదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై న్యాయ నిపుణులతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి బీహార్ వెళ్లిన విషయాన్ని వివరించారు. బీజేపీ ఓటు హక్కును కాలరాస్తోందని, ఇప్పటికే 60 లక్షల ఓట్లను తొలగించిందని, బతికిన వారిని కూడా చనిపోయినవారిగా చూపించిందని, ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ను తప్పు పట్టిందని విమర్శించారు.
ప్రశాంత్ కిషోర్ కు కౌంటర్
మంత్రి సీతక్క ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) వ్యాఖ్యలపై స్పందించారు. మంత్రి మాట్లాడుతూ ‘ప్రశాంత్ కిషో(Prashant Kishore) ఎందుకు మాట్లాడుతున్నాడో అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమం చూసి ఆయన ఓర్చుకోలేక మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు. అలాగే సీతక్క(Seethakka) మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాల్లో బీఅర్ఎస్(BRS) ఎలా మాట్లాడుతుందో అదే తరహాలో ప్రశాంత్ కిషోర్ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మిత్రపక్షాలు కూడా మాట్లాడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమం దేశ ప్రజలకు కొత్త దిశగా మారనుందని.. కాంగ్రెస్ పార్టీ శక్తివంతంగా ముందుకు సాగుతోందని సీతక్క పేర్కొన్నారు.
Also Read: Gadwal Town: ఇళ్ల మధ్యనే కల్లు విక్రయాలు.. పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు