Sand Bazaars: పేదవాడి కల సాకారం చేసేందుకే ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ(Damodara Rajanarsimha) అన్నారు. ఇందిరమ్మ లబ్దిదారులపై ఆర్థిక భారం పడకూడదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాండ్ బజార్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకే ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. అందోలు జోగిపేట మున్సిపాలిటీ శివారులో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్(Sand Bazaar)ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్వంత ఇళ్లు కట్టుకోవాలన్నది పేదవాడి కళయని, ఆ కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు కానట్లయితే వారికి కూడా ఇళ్లను మంజూరు చే యిస్తానని మంత్రి హమీ ఇచ్చారు. బిల్లుల విషయంలో ఎటువంటి ఆందోళన చెందకూడదన్నారు. మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు.
Also Read: Jogulamba Gadwal: ఇంకెన్నాళ్లీ యూరియా కష్టాలు.. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్న మహిళలు
దళారుల జోక్యం లేకుండా నేరుగా ప్రజలకు సాండ్ బజార్(Sand Bazaar) నుండి ఇసుకను సరఫరా చేస్తారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల(Indiramma’s house) లబ్ధిదారులకు నాణ్యమైన ఇసుక ను అందించటమే లక్ష్యంగా టన్నుకు రూ.1200 చొప్పున విక్రయిస్తారని, బయట కొనుగోలు చేయడం వల్ల లబ్దిదారుడిపై అదనంగా రూ.50వేల వరకు భారం పడనుందని అన్నారు. ప్రతి లబ్దిదారుడికి సుమారుగా ఇళ్లు నిర్మించుకునేందుకు 40 టన్నుల వరకు ఇసుక అవసరం ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేసారన్నారు.
నియోజకవర్గానికి 3500 ఇళ్లు
సంగారెడ్డి జిల్లా(Sangareddy District) ఆందోల్ నియోజకవర్గంలోనే మొట్ట మొదటి సారిగా సాండ్ బజార్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలకు నాణ్యమైన ఇసుకను సరసమైన ధరలో అందించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని దళారుల బెడద లేకుండా, పారదర్శక పద్ధతిలో, నేరుగా ప్రజలకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం సాండ్ బజార్ల(Sand Bazaar)ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ పథకంతో ప్రతి ఒక్క పేద వాడికి ఇళ్లు కట్టుకోవాలన్న ఆశ పుట్టిందన్నారు. అందోలు నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు కాగా, జోగిపేట(Jogipet) మున్సిపాలిటీ పరిధిలో 125 ఇళ్లల్లో 112 పునాదులు పూర్తయ్యాయన్నారు. బిల్లులు సాధ్యమైనంతవరకు తొందరగా మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. సరఫరా ప్రక్రియలో ఎవరైనా దళారుల మాదిరిగా వ్యవహరించినా, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మైనింగ్ కార్పొరేషన్, రెవెన్యూ, హౌసింగ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఇసుక సరఫరాను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం తరపున మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం లో ఇసుక కొరత సమస్య రాకూడదు. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, వారికి కావలసినంత ఇసుక సాండ్ బజార్లలో నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి అని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇసుక సరఫరా ఆన్లైన్లోనూ పర్యవేక్షణ జరుగుతుందని, ఎవరైనా అక్రమ రవాణా చేస్తే వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో టీజీఎండిసి ఎండి భవేష్ మిశ్రా , జిల్లా అదనపు ( స్థానిక సంస్థలు)కలెక్టర్ చంద్రశేఖర్ , జిల్లా. మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రఘుబాబు,జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి , మార్కెఫెడ్ డైరెక్టర్ శేరి జగన్ మోహన్ రెడ్డి , పిఎసిఎస్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి , హౌసింగ్, రెవిన్య , పోలీస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read: Khammam District: ఖమ్మం జిల్లాలో మంత్రి పీఏ ఆగడాలు.. ప్రజలు ఇబ్బందులు