Viral News: ప్రభుత్వాలు, పోలీసు శాఖలు, సైబర్ విభాగాలు సమష్టిగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, కొత్త నిబంధనలు, టెక్నికల్ విధానాలు సూచిస్తున్నప్పటికీ సైబర్ నేరాలు ఆగడం లేదు. సరికొత్త పంథాల్లో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన మహారాష్ట్రలో (Viral News) చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని హింగోళి జిల్లా చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి వాట్సాప్కు అచ్చం ఒక పెళ్లి శుభలేఖ పోలిన ఒక మాల్వేర్ ఫైల్ వచ్చింది. ఎవరో డిజిటల్ శుభలేఖ పంపించి ఉంటారులే అనుకొని ఆయన దానిని ఓపెన్ చేశారు. అంతే, అతడి అకౌంట్ నుంచి దాదాపు రూ.2 లక్షలు కట్ అయ్యాయి. కొద్దిసేపటి తర్వాత సైబర్ మోసానికి గురైనట్టు సదరు ఉద్యోగి గుర్తించాడు.
కొత్త నంబర్ను ఈ మెసేజ్ వచ్చిందని అతడు వాపోయాడు. ఆగస్టు 30న పెళ్లికి రావాలంటూ ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఆ ఫైల్ను రూపొందించారని వెల్లడించారు. ‘‘మీకు తప్పకుండా పెళ్లికి రావాలి). 2025 ఆగస్టు 30న వివాహం. ఆనందమనే ద్వారాలను తెరిచే మార్గం ప్రేమ ఒక్కటే’’ అంటూ ఒక పెళ్లి కోటేషన్ను కూడా పంపించారు. దీంతో, బాధిత వ్యక్తి నమ్మేశాడు. పైగా పంపించిన ఆహ్వాన పత్రిక రూపంలో పంపించిన ఫైల్ అచ్చం పీడీఎఫ్గా మాదిరిగా అనిపించడంతో ఆయన క్లిక్ చేశారు. కానీ, అది పీడీఎఫ్ కాదు. అది ఏపీకే (Android Application Package) ఫైల్. బాధిత వ్యక్తి దాని మీద క్లిక్ చేయంగానే అది డౌన్లోడ్ అయ్యింది.
Read Also- Jaishankar on Trump: డొనాల్డ్ ట్రంప్పై విదేశాంగ మంత్రి జైశంకర్ డేరింగ్ కామెంట్స్
బాధితుడు ఆ ఫైల్ను ఓపెన్ చేసిన వెంటనే సైబర్ నేరగాళ్లు అతడి ఫోన్ను యాక్సెస్ చేసుకున్నారు. అతడి బ్యాంకింగ్ డేటాను దొంగిలించి, బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.1,90,000 కొల్లగొట్టారు. దీంతో, బాధితుడు లబోదిబోమన్నాడు. వెంటనే వెళ్లి హింగోళి పోలీస్ స్టేషన్లో, సైబర్ సెల్ విభాగంలో తెలియని వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సైబర్ భద్రతపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. నిజానికి, ఈ పెళ్లి ఆహ్వాన పత్రిక రూపంలో సైబర్ మోసాలకు పాల్పడడం (Wedding Invitation Scam) ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా కొన్ని కేసులు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది డబ్బును పోగొట్టుకున్నారు.
ఈ మోసపూరిత విధానంలో మోసగాళ్లు చాలా సులభంగా అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. అమాయక వ్యక్తుల వాట్సాప్లో ఒక పెళ్లి శుభలేఖ రూపంలో మెసేజ్ పంపిస్తున్నారు. పీడీఎఫ్ ఫైల్లా కనిపించే ఏపీకే లింక్ను సెండ్ చేస్తున్నారు. దానిమీద క్లిక్ చేయగానే అది మొబైల్లోకి డౌన్లోడ్ అవుతుంది. తద్వారా సైబర్ నేరగాళ్లు బాధితుల ఫోన్ను యాక్సెస్ చేసుకుంటున్నారు. ఫలితంగా నేరగాళ్లు ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఖాతాల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. అంతేకాదు, ఈ విధంగా బాధితుడి పేరుతో ఇతరుల్ని కూడా మోసం చేస్తున్నారు.
బ్యాంక్ డేటా, పాస్వర్డ్లు, ఓటీపీలు వంటి డేటా తస్కరిస్తున్నారు. హిమాచల్ప్రదేశ్ సైబర్ పోలీస్ శాఖ గతేడాది ఈ తరహా మోసాలపై హెచ్చరిక కూడా జారీ చేసింది. అపరిచితుల నుంచి వచ్చే వాట్సాప్ సందేశాలు లేదా ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని, అలాంటి వాటి ద్వారా ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ అవుతాయని తెలిపింది. అనుమానాస్పద లింకులు, ప్రత్యేకించి పెళ్లి ఆహ్వానాల రూపంలో వచ్చే ఫైళ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, వెడ్డింగ్ కార్డు పేరిట జరిగిన మోసంపై దేశవ్యాప్తంగా జనాలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.