Parliament Security Breach: మన దేశంలో అత్యంత పటిష్టమైన భద్రత ఉండే ప్రభుత్వ భవన సముదాయాల్లో పార్లమెంట్ బిల్డింగ్ ఒకటి. చీమ చిటుక్కుమన్నా అక్కడి భద్రతా సిబ్బంది పసిగట్టేస్తారని అంతా అనుకుంటారు. కానీ, మరోసారి పార్లమెంట్ నూతన భవనం వద్ద మరోసారి దారుణమైన భద్రతా లోపం (Parliament Security Breach) వెలుగులోకి వచ్చింది. శుక్రవారం (ఆగస్టు 22) ఉదయం 6.30 గంటల సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి నూతన పార్లమెంట్ భవనం ఆవరణలోకి ప్రవేశించాడు. ఓ గోడ దూకి లోపలికి వెళ్లాడు. రైల్ భవన్కు సమీపంలో ఉన్న ఓ చెట్టు సాయంతో గోడ దాటి, పార్లమెంట్ భవనంలోని గరుడ ద్వారం (Garuda Dwar) వరకు వెళ్లాడు.
లోపలికి దూకే సమయంలో గుర్తించలేకపోయినప్పటికీ, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అప్రమత్తమయ్యారు. నిందిత వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన గుర్తింపు, పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడం వెనుక అతడి ఉద్దేశం, భద్రతా వ్యవస్థను ఎలా దాటి వచ్చాడన్న అంశాలపై సదరు వ్యక్తిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు. నిఘా వ్యవస్థలో లోపాలు, స్పందనలో పొరపాట్లు అంశాలపై సమీక్షించారు. భద్రతా మార్గదర్శకాలను మరోసారి సమీక్షించనున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజునే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. జులై 21న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21న నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే.
గతంలోనూ భద్రతా ఉల్లంఘనలు
శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడం కలకలం రేపింది. అయితే, ఈ విధంగా భద్రతా లోపం బయటపడడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది కూడా ఓ యువకుడు గోడ దాటి పార్లమెంట్ భవనం ఆవరణలోకి ప్రవేశించాడు. షార్ట్, టీ-షర్ట్ ధరించి ఉన్న అతడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని అధికారులు నిర్ధారించారు.
Read Also- Speaker Gaddam Prasad: ఆ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్న: గడ్డం ప్రసాద్ కుమార్
2023లో పొగదాడి ఘటన
పార్లమెంట్లో భద్రతా లోపాలు బయటపడిన ఘటన 2023లో కూడా జరిగింది. ఇద్దరు వ్యక్తులు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూకారు. వారి వద్ద ఉన్న స్మోక్ కంటైనర్ల (canisters) నుంచి పసుపు రంగు పొగను వదిలారు. బిగ్గరగా నినాదాలు కూడా చేశారు. ఈ ఘటన తీవ్రమైన భద్రతా లోపాన్ని బయటపెట్టింది. నిందితుల్లో ఒకరు లక్నోకి చెందిన సాగర్ శర్మగా (25), మైసూర్కు చెందిన మనోరంజన్ (35)గా గుర్తించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో ఇది జరిగింది. ఈ ఘటన పట్ల దేశమంతా ఉలిక్కిపడింది. ఇక సభలో సభ్యులైతే భయపడిపోయారు. ఆ ఘటన తర్వాత, తాజాగా ఓ వ్యక్తి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించాడనేది చర్చనీయాంశంగా మారింది. కాగా, గత రెండేళ్లలో పార్లమెంట్ వంటి అత్యున్నత స్థాయి భద్రత పర్యవేక్షణలో ఉండే భవనం వద్ద భద్రతా లోపాలు బయటపడడంపై ఎంపీలతో పాటు జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.