Education Health Department: వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ పోస్టుల్లో గోల్ మాల్ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెబుతూ కొందరు అధికారులకు అక్రమాలకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్, ఆయూష్ విభాగాల్లో ఇటీవల జరిగిన కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్లలో ఈ తప్పిదాలు జరిగాయి. మెరిట్ ప్రకారం కొన్ని పోస్టులు భర్తీ చేయకపోగా, అసలు మెరిట్ లిస్టే లేకుండా మరి కొన్ని పోస్టులు భర్తీ చేసినట్లు సమాచారం.
దీంతో అర్హులైన అభ్యర్థులకు అవకాశాలు రాలేదు. సంబంధిత అధికారులను అడిగినా ఏడాది నుంచి సతాయిస్తున్నారే తప్ప, తమకు న్యాయం చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. డీఎమ్హెచ్వోల నుంచి కలెక్టర్ల వరకు, అడ్మినిస్ట్రేషన్ అధికారుల నుంచి డైరెక్టర్ స్థాయి ఆఫీసర్ల వరకు కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వివరిస్తున్నారు. కొందరు అధికారులు, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ల అత్యుత్సాహంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్లు వాపోతున్నారు. ఆర్టీఐల ద్వారా సమాచారం అడిగినా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
అసలేం జరిగిందంటే?
నేషనల్ హెల్త్ మిషన్(National Health Mission) ద్వారా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానాల్లో వివిధ కేటగిరీల్లోని పోస్టుల భర్తీకి భద్రాద్రి కొత్తగూడెం*((Bhadradri Kothagudem)జిల్లాలో 2024 ఫిబ్రవరి 24న నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో కొన్ని జిల్లా, మల్టీ జోనల్, జోనల్ పోస్టులు ఉన్నాయి. అయితే, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పోస్టుల్లో అన్యాయాలు జరిగినట్లు నంద్యాల అనిల్ కుమార్ అనే అభ్యర్థి బయటపెట్టాడు. తాను ఈ పోస్ట్ కోసం అప్లై చేశానని, అన్ని అర్హతలతో పాటు మెరిట్ లిస్టులోనూ టాప్లో ఉన్నానని చెప్పాడు. కానీ మెరిట్లో తనకంటే కింద ఉన్న ఇద్దరికి ఈ పోస్టులు ఇచ్చినట్లు వెల్లడించాడు.
అడిగినా స్పందించడం లేదు
మెరిట్ లిస్టులో తనది 12వ నెంబర్ ఉండగా, 16, 36 నెంబర్లోని అభ్యర్ధులకు పోస్టులు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నించాడు. ఇదే విషయంపై డీఎమ్హెచ్, ఇతర అధికారులను అడిగినా స్పందించడం లేదని వాపయాడు. పైగా ఇది డిస్ట్రిక్ట్ పోస్ట్ అని, జోనల్ కేడర్ కాదని తనను నాన్ లోకల్గా చూపించి పక్కకు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, డీపీసీ పోస్ట్ ఏ కేడర్లో ఉన్నది? దాని గైడ్ లైన్స్ ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగానని, ఇప్పటి వరకు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా డీఎమ్హెచ్వో కార్యాలయం నుంచి సమాధానం రాలేదన్నారు. అడిగిన ప్రతీసారి సాకులు చెబుతున్నట్టు అనిల్ చెప్పాడు.
ఈ పోస్ట్ ఏ కేడర్లో ఉన్నదనే విషయం తెలుసుకునేందుకు ఖమ్మం డీఎమ్హెచ్వో కార్యాలయంలో ఆర్టీఐ ద్వారా అప్లై చేయగా, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పోస్ట్ జోనల్ కేడర్ అని సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. ఒకే పోస్ట్ వేర్వేరు డీఎమ్హెచ్వో కార్యాలయాల్లో వేర్వేరు కేడర్లో ఎలా ఉంటుందని ప్రశ్నించాడు. కానీ భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) డీఎమ్హెచ్వో ఇచ్చిన నోటిఫికేషన్లో ఆ పోస్ట్ డిస్ట్రిక్ట్ కేడర్ అని చూపించడం గమనార్హం. వాస్తవానికి అనిల్ ఖమ్మం జిల్లా పరిధిలోకి వస్తాడు. జోనల్ పోస్ట్ అని భావించి భద్రాద్రి, ఖమ్మం డీఎమ్హెచ్వో ఆఫీస్ల్లో ఈ పోస్టు కొరకు అప్లై చేశాడు.
అధికారులు చెప్పింది నమ్మాలా?
భద్రాద్రిలో మెరిట్ లిస్టులో టాప్ ఉన్నప్పటికీ, డిస్ట్రిక్ట్ పోస్ట్ అని నాన్ లోకల్ చూపుతూ రిజెక్ట్ చేసిన వైద్య అధికారులు, ఖమ్మం జిల్లాలోని ఇదే పోస్టుకు భద్రాద్రి జిల్లాకు చెందిన వ్యక్తులను తీసుకున్నారని తెలిసింది. డిస్ట్రిక్ట్ పోస్ట్ అయితే తప్పనిసరిగా ఆ పరిధిలోని అర్హులనే ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ పక్క జిల్లాకు చెందిన వ్యక్తులను తీసుకోవడమే కాకుండా, ఖమ్మం జిల్లా వైద్య అధికారులు డీపీసీ పోస్ట్, జోనల్ పోస్ట్ అంటూ లిఖిత పూర్వకంగా క్లారిటీ ఇచ్చారు. డీపీసీ పోస్టుపై భద్రాద్రి అధికారులు చెప్పింది నమ్మాలా? ఖమ్మం(Khammam)అధికారులు ఇచ్చిన క్లారిటీని పరిగణనలోకి తీసుకోవాలా? అంటూ అనిల్ ప్రశ్నిస్తున్నాడు. ఈ పోస్టుల భర్తీపై భారీ స్థాయిలో గోల్ మాల్ జరిగినట్లు తనకు అనుమానం ఉన్నదని నొక్కి చెప్పాడు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఎంక్వైయిరీ చేయించి, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.
అయూష్లోనూ ఇదే పరిస్థితి
ఇక నేషనల్ ఆయూష్ మిషన్(National AYUSH Mission) ప్రోగ్రామ్ల నిర్వహణకు కాంట్రాక్ట్ విధానంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ (డీపీఎమ్) పోస్టులు భర్తీ చేశారు. ఈ పోస్టుకు వేతనం రూ.50 వేల చొప్పున ఉండగా, ఎంబీఏ హెల్త్ కేర్ కోర్సు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. జిల్లాకు ఒకటి చొప్పున 33 పోస్టులు భర్తీకి సుమారు 2 వందలకు పై బడి అభ్యర్థులు పోటీ పడ్డారు. బ్యాచ్ల వారీగా ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. కానీ మెరిట్ లిస్ట్ ఇవ్వకుండానే పోస్టులు భర్తీ చేయడం గమనార్హం. భర్తీ చేయబడ్డ వారిలో ఎంబీఏ హెల్త్ కేర్ కోర్సులు చేయని వారు సుమారు 16 మంది ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే మెరిట్ లిస్ట్, ఎంపికైన వారి వివరాలు ఉన్నతాధికారులు ఇవ్వడం లేదని, ఆన్ లైన్, ఆఫ్ లైన్లోనూ పొందుపరచలేదని బాధితులు చెబుతున్నారు.
చాలా మంది బాధితులు ఆర్టీఐ ద్వారా కూడా సమాచారం అడిగారు. కానీ ఆయుష్ ఉన్నతాధికారులు స్పందించడం లేదట. ఆయుష్ ప్రధాన కార్యాలయంలోని కొంద మంది అధికారుల ప్రమేయంతోనే ఈ రిక్రూట్ మెంట్లో గోల్ మాల్ జరిగిందని, భారీ స్థాయిలో ముడుపులు అందినట్లు బాధితులు చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆయుష్ డిపార్ట్మెంట్తో సంబంధం లేని అధికారులతో కమిటీ వేయాలని కోరుతున్నారు. రిక్రూట్మెంట్లు పారదర్శకంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి,(CM Revanth Reddy)వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha)పదే పదే చెబుతున్నా కొంత మంది అధికారులు తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం గమనార్హం.
Also Read: Independence Day: తొర్రూరులో స్వాతంత్ర్య దినోత్సవం రోజే జాతీయ జెండాకు అవమానం