Tummala Nageswara Rao: చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5% జీఎస్టీని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర చేనేత, హస్తకళల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్(Giriraj Singh)కు లేఖ రాశారు. చేనేత రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
Also Rad: T-Fiber: ప్రజలకు మెరుగైన సేవలందేలా చూడాలి.. టీ ఫైబర్పై సమీక్షలో సీఎం కీలక అదేశాలు
చేనేత రంగం సమస్యలు..
వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగం, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మందికి జీవనాధారంగా ఉందని మంత్రి తెలిపారు. అయితే, ముడిసరుకుల ధరలు పెరగడం, పవర్లూమ్, మిల్లు రంగాలతో పోటీ పడలేకపోవడం వల్ల చేనేత కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు తోడు, చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీ విధించడం వల్ల వాటి ధరలు పెరిగి, వినియోగం తగ్గిందని వివరించారు. దీనితో కార్మికుల జీవనాధారం సంక్షోభంలో పడి, తమ సంప్రదాయ వృత్తిని వదిలి వలస వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఖాదీ ఉత్పత్తులకు జీఎస్టీ మినహాయింపు ఉన్నప్పుడు, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం అన్యాయమని పేర్కొన్నారు.
తెలంగాణ చేనేతకు ప్రత్యేక గుర్తింపు..
తెలంగాణలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల్(Gadwal) కాటన్, పట్టు చీరలు, నారాయణపేట కాటన్, పట్టు చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్(Warangal) దర్రీస్, కరీంనగర్ డబుల్ క్లాత్ చెద్దర్లు వంటి ఆరు ఉత్పత్తులకు భౌగోళిక సూచిక గుర్తింపు లభించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,046 మంది చేనేత కార్మికులు, 34,569 మంది అనుబంధ కార్మికులు ఈ రంగంలో పని చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేనేత రంగాన్ని, కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Also Read: Heavy Rains in Medchal: మేడ్చల్లో భారీ వర్షాలు.. ఆ గ్రామానికి రాకపోకలు బంద్!
