Telangana Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో సుమారు రూ.200 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) (టీసీఏ) జనరల్ సెక్రటరీ ధారం గురువా రెడ్డి(Guruva Reddy) సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ హెచ్సీఏలోని అవినీతిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హెచ్సీఏ క్లబ్ వ్యవస్థ, నిధుల వినియోగం పూర్తిగా అవినీతిమయం అయ్యాయన్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని గురువా రెడ్డి ఆరోపించారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
వారి సొంత ఆడిటర్లు కూడా అమోదించని 2022-–23, 2023–-24 ఆర్థిక సంవత్సరాల ఖాతాలను హెచ్సీఏ జనరల్ బాడీ అక్రమంగా ఆమోదించిందని చెప్పారు. ఒక ఆడిట్ నివేదికను మరో దానికి కాపీ చేసుకున్నారన్నారు. గతంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కార్యదర్శులు, సరఫరాదారులపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదైనా హెచ్సీఏ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. జడ్జి ఎల్. నాగేశ్వర రావు కమిటీ సూచించిన సంస్కరణలను కూడా హెచ్సీఏ పట్టించుకోలేదని, నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా క్రికెట్ పేరిట అక్రమాలు..
హెచ్సీఏలో దోచుకున్న రూ.200 కోట్లలో, రూ.12 కోట్లకు పైగా జిల్లా క్రికెట్ అభివృద్ధి పేరుతో దుర్వినియోగం చేశారని గురువా రెడ్డి అన్నారు. జట్లు లేని క్లబ్లకు, బీసీసీఐ నియమావళిని ఉల్లంఘించే సంస్థలకు ఓటు హక్కు కల్పించారని వెల్లడించారు. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నవారిని అరెస్ట్ చేయాలన్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల యువ క్రికెటర్లను, వారి తల్లిదండ్రులను రక్షిస్తుందని అభిప్రాయపడ్డారు.90 ఏళ్ల చరిత్ర ఉన్నా తెలంగాణలో కనీస క్రికెట్ మౌలిక సదుపాయాలు లేకపోవడం బాధాకరమన్నారు. ఈ వ్యవహారంపై ఖమ్మం నియోజకవర్గ మంత్రులు, ఎంపీలు వెంటనే దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.