Khazana Jewellery Robbery: సంచలనం సృష్టించిన ఖజానా జువెలరీ దోపిడీ కేసులో ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో అయిదుగురి కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి బంగారం పూత పూసిన 900 గ్రాముల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. లూటీకి పాల్పడింది బీహార్(Bihar) రాష్ట్రం సారన్, సివాన్ జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. మాదాపూర్ డీసీపీ వినీత్(DCP Vineth) మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 12న ఆరుగురు సభ్యులుగల దోపిడీ దొంగల ముఠా చందానగర్ మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న ఖజానా జువెలరీ షాపులోకి చొరబడ్డ విషయం తెలిసిందే.
బంగారు నగలు దాచి పెట్టిన లాకర్ తాళంచెవులు ఇవ్వాలని జువెలరీ దుకాణం అసిస్టెంట్ మేనేజర్ సతీష్ కుమార్ ను తుపాకీతో బెదిరించారు. తన వద్ద తాళంచెవులు లేవని చెప్పటంతో గ్యాంగ్ లోని ఓ సభ్యుడు సతీష్ కుమార్(Sathish) కాలిపై కాల్పులు జరిపాడు. అనంతరం మిగితా ఉద్యోగులను తుపాకులతో భయపెట్టి షో కేసుల్లో ఉన్న బంగారం పూత పూసిన 10కిలోల వెండి ఆభరణాలను దోచుకుని వచ్చిన బైక్ ల పైనే ఉడాయించారు. పట్టపగలే జరిగిన ఈ దోపిడీ అన్ని వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. దాంతో సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఎస్వోటీ, సీసీఎస్ తోపాటు స్థానిక పోలీసులతో మొత్తం పది బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం వేట మొదలు పెట్టించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దోపిడీ దొంగలు సంగారెడ్డి వైపు పరారయ్యారని నిర్ధారణ కావటంతో జహీరాబాద్ వరకు ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. అదే సమయంలో మహారాష్ట్ర(Maharasta), కర్ణాటక(karnataka) పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.
48గంటల్లోనే
ఈ క్రమంలో గ్యాంగ్ లో సభ్యునిగా ఉన్న బీహార్ రాష్ట్రం సారన్ జిల్లాకు చెందిన ఆశిష్ కుమార్ సింగ్(Ashish Kumar Singh) (22)ను పూణెలో అరెస్ట్ చేశారు. విచారణలో ఆశిష్ కుమార్ వెల్లడించిన వివరాల మేరకు సారన్ జిల్లాకే చెందిన దీపక్ కుమార్(Deepak Kumar) (22)ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 900 గ్రాముల బంగారం పూత పూసిన వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు.
వెల్డింగ్ వర్కర్ గా..
గ్యాంగ్ లో సభ్యునిగా ఉన్న దీపక్ కుమార్(Deepak Kumar) కొంతకాలం క్రితం హైదరాబాద్9Hyderabad) వచ్చి ఆస్ బెస్టాస్ కాలనీలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. వెల్డింగ్ వర్కర్ గా పని చేస్తూ కాలం గడుపుతున్నాడు. కాగా, పదిహేను రోజుల క్రితం ఆశిష్ కుమార్ తోపాటు మరో అయిదుగురు హైదరాబాద్ వచ్చారు. అప్పటికే పరిచయం ఉన్న దీపక్ కుమార్ ఇంట్లోనే ఆశ్రయం తీసుకున్నారు. అనంతరం జగద్గిరిగుట్టలోని ఏ1 షోరూం నుంచి ఓ పల్సర్ తోపాటు మరో బైక్ ను కొనుగోలు చేశారు. అనంతరం చందానగర్ పరిసర ప్రాంతాల్లోని జువెలరీ షాపుల వద్ద రెక్కీ చేశారు.
దోపిడీకి ఖజానా జువెలరీ షాపు అనువుగా ఉందని, అక్కడ లూటీ చేస్తే కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకోవచ్చని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో దీపక్ కుమార్ మినహా మిగితా ఆరుగురు ఈనెల 12న ఉదయం 10.30గంటల సమయంలో రెండు బైక్ లపై ఖజాజా జువెలరీ షాపు వద్దకు వచ్చారు. దుకాణం తెరవగానే సెక్యూరిటీ గార్డుకు తుపాకీ చూపించి భయపెట్టి లోపలికి చొరబడ్డారు. బంగారు నగలను దోచుకునే అవకాశం లేకపోవటంతో వెండి ఆభరణాలను మూటగట్టుకుని ఉడాయించారు.
Also Read: Visa In Just 1 day: నిబంధనలు సరళతరం చేసిన కేంద్ర ప్రభుత్వం
గ్యాంగ్ లీడర్ కరడుగట్టిన నేరస్తుడు
పోలీసుల విచారణలో గ్యాంగ్ లీడర్(Gang Ledar) గా ఉన్న వ్యక్తి కరడుగట్టిన పాత నేరస్తుడని వెల్లడైంది. అతనిపై రెండు హత్యలు, రెండు హత్యాయత్నం, రెండు బందిపోటు దోపిడీలు, రెండు బెదిరించి డబ్బు లూటీ చేయటంతోపాటు మారణాయుధాల నిరోధక చట్టం ప్రకారం అయిదు కేసులు నమోదై ఉన్నట్టు తెలిసింది. ఇక, ముఠాలోని మిగితా సభ్యులందరికీ నేర చరిత్ర ఉన్నట్టుగా తేలింది.
నగల దుకాణాలే టార్గెట్
ఈ గ్యాంగ్ నగల దుకాణాలను మాత్రమే టార్గెట్ చేస్తుందని డీసీపీ వినీత్(DCP Vineeth) చెప్పారు. బెంగాల్(Bengal) తోపాటు దేశంలోని మరికొన్ని చోట్ల ఇలాగే జువెలరీ షాపుల నుంచి కోట్ల రూపాయల విలువ చేసే సొత్తును దోచుకున్నారని తెలిపారు. హైదరాబాద్(Hyderabad) వచ్చిన తరువాత దీపక్ కుమార్ సహాయంతో పదిహేను రోజులపాటు చందానగర్ ప్రాంతంలో రెక్కీ జరిపి దోపిడీకి ఖజానా జువెలర్స్ ను ఎంపిక చేసుకున్నట్టు చెప్పారు. తుపాకులను బీహార్ నుంచే తెచ్చుకున్నట్టు తెలిపారు. బస్సు, రైలు మార్గాల్లో ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. లూటీ తరువాత పారిపోవటానికి రెండు బైక్ లను కొనుగోలు చేశారన్నారు.
అందరినీ గుర్తించాం
దోపిడీకి పాల్పడి పరారీలో ఉన్న మిగితా అయిదుగురు నిందితులను గుర్తించినట్టు డీసీపీ వినీత్ చెప్పారు. వారిని పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయన్నారు. త్వరలోనే ఈ అయిదుగురిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ఆ తరువాత జరిపే విచారణలో ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ? ఎన్ని నేరాలకు పాల్పడింది? అన్న వివరాలు పూర్తిగా వెల్లడి కాగలవన్నారు. నిందితులపై బీఎన్ఎస్ 11(2), 115(2), 127(2), 324(3), 310(2), 351(3) సెక్షన్లతోపాటు మారణాయుధాల నిరోధక చట్టం సెక్షన్ 25(1–బీ), 27(1) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. జువెలరీ షాపుల యజమానులు భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సాయుధ గార్డులను నియమించుకోవాలని చెప్పారు. అధునాతన అలారం సిస్టంను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని పనిలో పెట్టుకునే ముందు వారికి ఏదైనా నేరచరిత్ర ఉందా? అన్న విషయాన్ని ఆయా సంస్థలు తెలుసుకోవాలన్నారు. దీని కోసం పోలీసుల సాయం కూడా తీసుకోవచ్చని చెప్పారు.
Also Read: Venkatesh – Trivikram: మరీ ఇంత సైలెంట్గానా!.. ‘వెంకీ-త్రివిక్రమ్’ ప్రాజెక్ట్ ప్రారంభం