Murder in Saudi Arabia: నేరం చేసినవాడు ఎప్పటికైనా దొరకాల్సిందే. తప్పించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టవు. నేరస్థుడు ఏ స్థాయి వ్యక్తి అయినా చివరకు న్యాయస్థానం ముందు నిలబడాల్సిందే. ఈ విషయాన్ని చాటిచెప్పే ఘటన ఒకటి ఢిల్లీలో తాజాగా వెలుగుచూసింది. ఓ వ్యక్తి 26 ఏళ్లక్రితం సౌదీ అరేబియాలో హత్యకు పాల్పడ్డాడు. అప్పటినుంచీ అతడు పరారీలోనే ఉన్నాడు. అయితే, ఎట్టకేలకు సుదీర్ఘ కాలం గడిచిన తర్వాత నిందితుడు మహ్మద్ దిల్షాద్ చివరాఖరికి ఇటీవలే ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో (Murder in Saudi Arabia) పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన మహ్మద్ దిల్షాన్ను సీబీఐ చేతికి చిక్కాడు.
నిందితుడు మహ్మద్ ప్రస్తుత వయసు 52 ఏళ్లు అని, ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాకు చెందినవాడని సీబీఐ వెల్లడించింది. ఆగస్ట్ 11న మదీనా నుంచి జెడ్డా మీదుగా కొత్త పేరు, పాస్పోర్ట్తో భారత్కు తిరిగొచ్చాడని, ఆ సమయంలో అతడిని అరెస్ట్ చేశామని తెలిపింది. సౌదీ అరేబియా దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు నిందితుడిపై 2022 ఏప్రిల్లో భారత్లో కేసు నమోదు చేశామని, అతడి గుర్తించి స్థానికంగా విచారించేందుకు ఈ కేసును నమోదు చేసినట్టు సీబీఐ వివరించింది.
Read Also- Trump on Tariffs: అలా చేయకూడదేమో.. భారత్పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
సౌదీ అరేబియాలోని రియాద్లో 1999లో జరిగిన ఓ వ్యక్ హత్య కేసులో మహ్మద్ దిల్షాద్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని సీబీఐ అధికారులు తెలిపారు. అప్పట్లో అక్కడ హెవీ మోటార్ మెకానిక్గా, సెక్యూరిటీ గార్డ్గా మహ్మద్ పని చేశాడు. హత్య తర్వాత సౌదీ అధికారులను మోసం చేసి భారత్కు పారిపోయి వచ్చాడు. ఇక్కడకు వచ్చాక కొత్త పేరు, పాస్పోర్ట్ను అక్రమ మార్గాల్లో పొందాడని తెలిపారు. ఆ కొత్త పాస్పోర్ట్ను ఉపయోగిస్తూ దర్యాప్తు సంస్థల కళ్లుగప్పాడు. చట్టం నుంచి తప్పించుకుంటూ ఖతార్, కువైట్, సౌదీ అరేబియాలకు తరచూ వెళ్లి వస్తున్నాడని అధికారులు వెల్లడించారు. మహ్మద్పై లుక్ ఔట్ సర్క్యులర్ (LOC) కూడా జారీ అయ్యిందని సీబీఐ పేర్కొంది.
Read also- Constable Kanakam: సడన్గా మిస్సవుతున్న అమ్మాయిలు అడవిగుట్టలో ఏం చేస్తున్నారు?.. తెలియాలంటే!
దర్యాప్తులో భాగంగా వేర్వేరు సాంకేతిక ఆధారాలు, మానవ మేధసును ఉపయోగించి మహ్మద్ కొత్త పాస్పోర్ట్ను గుర్తించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఆ తర్వాత మహ్మద్పై ఎల్వోసీ జారీ అయిందని, ఈ పరిణామాలపై సమాచారం తెలియని మహ్మద్ ఈ నెల 11న ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చాడు. అప్పటికే అప్రమత్తమైన ఇమిగ్రేషన్ విభాగం అధికారులు, సీబీఐకి సమాచారం ఇచ్చారు. దీంతో, అధికారులు అక్కడికి చేరుకొని మహ్మద్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం ఆగస్టు 14న అతడిని కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని, ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ పేర్కొంది.
Read Also- Khazana Jewellers Robbery: ఖజానా దోపిడి దొంగలు మామూలోళ్లు కాదు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన డీసీపీ!