SC on Delhi-NCR: దేశంలో వీధి కుక్కల సంఖ్య నానాటికి పెరిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడా చూసిన వీధి కుక్కలే దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల అవి చిన్నారులపై దాడి వారి ప్రాణాలకు ముప్పును తీసుకొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ కుక్కల బెడద నానాటికి అధికమవుతోంది. ఈ నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. వీధి కుక్కల సమస్యకు చెక్ పెట్టేందుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?
వీధి కుక్కలను నివాస ప్రాంతాల నుండి దూరంగా తరలించాల్సిందేనని దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ చర్యను అడ్డుకునే ఏ సంస్థ అయిన కఠిన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. ఢిల్లీలో వీధి కుక్కల దాడులు, రేబీస్ వల్ల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ముఖ్యమైన ఆదేశాన్ని సుప్రీం కోర్టు జారీ చేసింది. వీధి కుక్కల దాడుల వల్ల రేబిస్ మరణాలు పెరుగుతున్నాయన్న ఓ వార్త కథనం ఆధారంగా సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జె.బి. పార్డివాలా (Justice JB Pardiwala), జస్టిస్ ఆర్. మహాదేవన్ (Justice R Mahadevan)లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. దీనిపై కేంద్రం తన వాదనలు వినిపించవచ్చని.. అయితే కుక్కల ప్రేమికులు గానీ, ఇతర వ్యక్తుల పిటిషన్లను మాత్రం స్వీకరించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.
భావోద్వేగాలు వద్దు
‘ఇది మన కోసం కాదు.. ప్రజా ప్రయోజనం కోసం. కాబట్టి ఎటువంటి భావోద్వేగాలు కలగరాదు. వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని జస్టిస్ పార్డివాలా అన్నారు. ‘అన్ని కాలనీల నుండి కుక్కలను పట్టుకుని దూర ప్రాంతాలకు తరలించండి. ప్రస్తుత నియమాలను మర్చిపోండి’ అని ఆయన అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాలాకు సూచించారు. జస్టిస్ పార్డివాలా ఈ విషయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయం కోరగా.. ఢిల్లీలో వీధి కుక్కలను తరలించడానికి ఒక ప్రదేశాన్ని గుర్తించామని చెప్పారు. కానీ జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ తెచ్చుకున్నందువల్ల ఆ ప్రణాళిక ఆగిపోయిందని కోర్టుకు తెలిపారు.
‘వారిని తీసుకురాగలరా?’
ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం మాట్లాడుతూ ‘ఈ జంతు హక్కుల కార్యకర్తలు రేబీస్ బారినపడి చనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలరా? వీధులకు వీధి కుక్కల నుండి పూర్తిగా విముక్తం కావాలి’ అని వ్యాఖ్యానించింది. అలాగే వీధి కుక్కలను దత్తత తీసుకోవడాన్ని కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. దేశ రాజధాని, నోయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్ పరిధి కలిగిన ఢిల్లీ ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలోని పౌర సంస్థలు తక్షణమే కుక్కల కోసం షెల్టర్లు నిర్మించి వీధి కుక్కలను తరలించి ఎనిమిది రోజుల్లో కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆ షెల్టర్లలో కుక్కలను చూసుకునే నిపుణులు ఉండాలని స్టెరిలైజేషన్, టీకాలు వేయాలని సూచించింది. ‘కుక్కలను బయటకు వదలరాదు. కుక్కలు బయటకు రాకుండా సీసీటీవీలు ఏర్పాటు చేయాలి. అలాగే కుక్కల దాడుల గురించి ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలి’ అని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read: Viral Video: మగాడికే కాదు.. సింహానికి అదే పరిస్థితి.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘అది కోర్టు దిక్కారమే’
‘స్టెరిలైజ్ చేసినా, చేయకపోయినా ముందు అన్ని వీధి కుక్కలను పట్టుకోండి. కొందరు కుక్కల ప్రేమికుల కోసం మన పిల్లల ప్రాణాలను త్యాగం చేయలేం’ అని అడ్వకేట్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. పౌర సంస్థలు ఈ పనిని ఎలా చేయాలో తామే నిర్ణయించుకోవచ్చని చెప్పారు. కావాలనుకుంటే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయవచ్చని కోర్టు సైతం తెలిపింది. ఈ చర్యను అడ్డుకునేవారు కోర్టు ధిక్కారానికి గురవుతారని ఈ సందర్భంగా ధర్మాసనం హెచ్చరించింది.