PM Modi: భారత దిగుమతులపై సుంకాలను అదనంగా 25 శాతం పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చేసిన ప్రకటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురువారం స్పందించారు. దేశ ప్రయోజనాలకే భారత్ తొలి ప్రాధాన్యం ఇస్తుందని, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా సరే ఈ విషయంలో వెనుకడుగు వేయబోదని స్పష్టమైన వైఖరిని చాటి చెప్పారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యకు నేరుగా కౌంటర్లు ఇచ్చారు. ‘‘మాకు రైతుల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం. రైతన్నలు, మత్స్యకారులు, పాడి పరిశ్రమ రైతుల ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పటికీ రాజీ పడబోదు. వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నాకు తెలుసు. అయినా సరే అందుకు సిద్దంగా ఉన్నాను. భారతదేశం కూడా సంసిద్ధంగా ఉంది’’ అని ఆయన స్పష్టం చేశారు.
కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందున భారతదేశ దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచుతున్నట్టుగా ట్రంప్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ప్రత్యక్ష ప్రతిస్పందనగా మోదీ స్పందించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతజయంతి అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు.
పూర్తిగా అసంబద్ధం..
ప్రధాని మోదీ కౌంటర్లకు ముందు బుధవారం కేంద్ర ప్రభుత్వం కూడా అమెరికా భారీ సుంకాలపై ఘాటుగా స్పందించింది. ట్రంప్ విధించిన టారిఫ్లు అన్యాయమైనవి, అనవసరమైనవి, అసంబద్ధమైనవని ఖండించింది. దేశ ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటామంటూ భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో కేవలం భారతదేశాన్ని మాత్రమే టార్గెట్ చేయడం అన్యాయమని అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యా నుంచి అమెరికా కూడా యురేనియం హెక్సాఫ్లోరైడ్, పల్లాడియం, ఎరువులు కొనుగోలు చేస్తోందని, భారత్పై మాత్రమే సుంకాలు విధించడం ద్వారా ద్వంద్వై వైఖరిని అనుసరిస్తుండడంపై విమర్శలు గుప్పించింది.
Read Also- Baba Vanga: వినాశనం తప్పదా.. త్వరలో భూమ్మీదకు ఏలియన్స్.. బయటకొచ్చిన వణుకుపుట్టించే నిజాలు?
భారత్పైనే అత్యధికం..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ వస్తువులపై అదనంగా 25 శాతం టారిఫ్ విధించడంతో మొత్తం టారిఫ్ 50 శాతానికి పెరిగింది. అమెరికా ఏ దేశంపైనైనా విధించిన అతి భారీ టారిఫ్ ఇదే కావడం గమనార్హం. రష్యా నుంచి చమురు, ఆయుధ సామగ్రి కొనుగోళ్ల విషయంలో అమెరికా చెప్పిన మాటను భారత్ వినకపోవడంతోనే ట్రంప్ జరిమానా పేరిట ఈ భారీ సుంకాలను విధించారు. అనూహ్యమైన ఈ పరిణామంతో భారత్-అమెరికా వ్యూహాత్మక బంధాలు చాలా కాలం తర్వాత బలహీనంగా మారాయని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు భారతదేశాన్ని ‘ఫ్రెండ్’గా అభివర్ణించిన ట్రంప్, నేడు రష్యాతో భారత్ సంబంధాలను సాకుగా చూపి సుంకాలు విధించడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు మధ్యలోనే నిలిచిపోవడం కూడా అధ్యక్షుడు ట్రంప్ అసహనానికి కారణం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, భారతీయ వ్యవసాయ మార్కెట్లో అమెరికాకు యాక్సెస్, డిజిటల్ ట్రేడ్ నిబంధనలు వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సడలింపు ఇవ్వకపోవడమే చర్చల విఫలానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
Read Also- TG School Holidays: అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవు.. తేదీలు ఇవే!