Viral News: ఓ సహచర ఎంపీతో కలిసి సోమవారం ఉదయం రోడ్డుపై వాకింగ్ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ ఆర్.సుధాకు కలలో కూడా ఊహించని షాక్ (Viral News) తగిలింది. ఢిల్లీలోని శాంతిపథ్ మార్గంలో ఆమె మెడలో బంగారు గొలుసుని ఓ దొంగ కొట్టేశాడు. చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. పోలాండ్ ఎంబసీకి అత్యంత సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఢిల్లీలో దౌత్య సంబంధ కార్యాలయాలకు నిలయంగా ఉండే చాణక్యపురిలో సాధారణంగా అయితే అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది. అయినప్పటికీ స్నాచర్ ఏకంగా ఒక ఎంపీ మెడలో చైన్ కొట్టేయడం షాక్కు గురిచేస్తోంది. ఈ ఘటనలో ఎంపీ సుధా గాయపడ్డారు. దుస్తులు కూడా స్వల్పంగా చినిగిపోయాయి.
ఈ ఘటనపై స్పందించిన ఎంపీ సుధా స్పందించారు. ‘‘ ఈ ఘటనలో నా మెడకు గాయమైంది. నా దుస్తులు కూడా చినిగిపోయాయి. నేను కింద పడబోయాను. కానీ, పడకుండా ఏదోవిధంగా తడబడుతూ మళ్లీ నిలబడగలిగాను. మేమిద్దరం సాయం కోసం కేకలు వేశాం’’ అని ఆమె వివరించారు. కాగా, ఎంపీ సుధా లోక్సభ ఎంపీగా ఉన్నారు. తమిళనాడు నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలోని మయిలాడుతురై నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశం సెషన్లో పాల్గొనేందుకు ఆమె ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.
Read Also- Shibu Soren: మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత.. సీఎం రేవంత్, కేసీఆర్ సంతాపం
ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె వాపోయారు. ‘‘దేశ రాజధానిలో, అత్యంత సురక్షితంగా భావించే ప్రాంతంలో కూడా మహిళలు భద్రంగా నడవలేకపోతే.. దేశంలో మహిళలకు అసలు భద్రత ఎక్కడ ఉందని చెప్పగలం?’’ అని ఆమె ప్రశ్నించారు. భద్రత ఉందని మహిళలు భావించే ప్రదేశం ఇంకెక్కడ ఉంది మరి? అని ప్రశ్నించారు. గాయపడతామేమో, ప్రాణాలు పోతాయేమో, విలువైన వస్తువులు పోతాయేమో అన్న భయాలు లేకుండా మహిళలు బతికే పరిస్థితి ఉండదా? అని ఆమె నిలదీశారు. తన అధికార నివాసం ఇంకా సిద్ధమవ్వకపోవడంతో ఆమె తమిళనాడు భవన్లో తాత్కాలికంగా ఉంటున్నట్టు తెలిపారు.
ఉదయం 6.15 గంటల సమయంలో…
తనకు ఎదురైన పరిస్థితిపై ఎంపీ సుధా పోలీసులకు ఫిర్యాదు చేశారు. “చాణక్యపురి వంటి పటిష్ట భద్రత జోన్లో, దౌత్యకార్యాలయాలు, అత్యంత పకడ్బందీ భద్రత కలిగిన సంస్థల ఉండే ప్రాంతంలో జరిగిన ఈ ఘటన చాలా షాకింగ్గా అనిపిస్తోంది’’ అని ఫిర్యాదులో వివరించారు. సోమవారం ఉదయం సుమారు 6:15 నుంచి 6:20 మధ్యలో ఈ ఘటన జరిగిందని, ఒక స్కూటీపై వచ్చిన వ్యక్తి బంగారు గొలుసు లాక్కొని వెళ్లిపోయాడని చెప్పారు. దుండగుడు ముఖానికి హెల్మెట్ ధరించి ఉన్నాడని, ముఖాన్ని పూర్తిగా కవర్ చేసుకున్నాడని ఎంపీ సుధా తెలిపారు. ఎదురుగా వచ్చి చైనా లాక్కొని పారిపోయాడని తెలిపారు. చైన్ స్నాచింగ్ ఘటన పోలాండ్ ఎంబసీ గేట్-3, గేట్-4ల మధ్య చోటుచేసుకుందని తెలిపారు. నిందిత వ్యక్తి నెమ్మదిగా ఎదురుగా వచ్చాడని, చైన్ స్నాచర్ అనే అనుమానం కలగలేదని ఆమె చెప్పారు. పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని, ఘటన జరిగిన పరిధిలోకి వచ్చే స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చానని వివరించారు. ఫిర్యాదు అందిన వెంటనే ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి ఒక టీమ్ను పంపించినట్టు తెలుస్తోంది. ఎంపీ సుధా ఫిర్యాదు అందినట్టు ఓ పోలీసు అధికారి నిర్ధారించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయని తెలిపారు.