Viral News: ఉన్నత చదవులు లేదా ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్లిన చాలా మంది భారతీయులు తిరిగి ఇండియాకు రావడం చాలా అరుదనే చెప్పాలి. అక్కడే ఉండిపోయేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందుకిలా ఉంటారు? ప్రశ్నకు స్వీడన్లో నివసిస్తున్న ఓ భారతీయుడు సమాధానం ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా (Viral News) అతడు పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. చైనా, భారతీయ విద్యార్థుల మధ్య తేడాను చర్చిస్తూ డా. రాజేశ్వరీ అయ్యర్ అనే ఎక్స్ యూజర్ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘‘చైనాను చైనా నిర్మించుకుంటోంది. కానీ, భారతీయులు అమెరికా నిర్మాణంలో దోహదపడుతున్నారు’’ అని డా.రాజేశ్వరీ పేర్కొనగా.. ఇందుకు గల కారణాలను స్విడన్లో నివసిస్తున్న అంకుర్ అనే వ్యక్తి ప్రాక్టికల్గా వివరించాడు.
తిరిగి రావడం కష్టం..
‘‘తిరిగి భారతదేశానికి రావడం చాలా కష్టం. ఎందుకంటే, అమెరికా, యూరప్ల్లో జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. అందుకే చాలామంది ఇండియాకు రాకుండా విదేశాల్లోనే శాశ్వతంగా ఉంటున్నారు’’ అని పేర్కొన్నాడు. ఎన్నారైలు తిరిగి రాకుండా ఉండడానికి గల కొన్ని కారణాలను ఆయన వివరించారు. ‘‘అధిక జీతాలు. రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయాలు. పరిశుభ్రమైన వాతావరణం, తక్కువ కాలుష్యం. భద్రతతో కూడిన జీవితం. వ్యవస్థలు పటిష్టంగా ఉండటం. పనికి తగిన గౌరవం. ట్రాఫిక్ లేకుండా సమయాన్ని ఆదా చేసుకోవడం. వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత. చిన్నపిల్లలకు మంచి విద్య, ఆరోగ్య సదుపాయాలు’’ అని అంకుర్ పేర్కొన్నాడు. అతడు చెప్పిన కారణాలను చాలామంది ఎన్నారైలు సమ్మతించారు.
Read Also-Siraj-Bumrah: బుమ్రాను ఒక ప్రశ్న అడిగిన మహ్మద్ సిరాజ్.. సమాధానం ఇదే
మరిన్ని కారణాలు ఇవే..
ఎక్కువ జీతాలతో పాటు మెరిట్ ఆధారిత పనివాతావరణం ఉంటుందని అంకర్ పేర్కొన్నారు. వీధుల్లో, రోడ్లపై భద్రత ఉంటుందని, శుభ్రమైన గాలి, బలమైన సామాజిక రక్షణ వ్యవస్థలు ఉంటాయన్నారు. ‘‘ యూరప్లో జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కోటాల కోసం తిప్పలు పడకుండా పిల్లలను మంచి స్కూళ్లలో చేర్పించుకునే అవకాశం ఉంటుంది. అమెరికాలోని బే ఏరియా, సియాటిల్, న్యూయార్క్ వంటి నగరాల్లో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, యూరప్లో నాకు అలా లేదు. డాలర్లలో పొదుపుతో పాటు స్టాక్ ఆప్షన్లు కారణంగా సంపద వేగంగా పెరుగుతుంది. యూరప్ పాస్పోర్ట్ ఉంటే ప్రపంచమంతా స్వేచ్ఛగా ప్రయాణించే వీలుంటుంది’’ అని అంకుర్ వివరించారు. అమెరికా, యూరప్ల్లో జీవితం బాగా మెరుగుగా ఉంటుందని, ఎవరి పరిచయం అక్కర్లేకుండా ప్రతిభ ఆధారంగా గుర్తింపు దక్కే ఉద్యోగ వాతావరణం విదేశాల్లో ఉంటుందని అంకుర్ పేర్కొన్నారు. కోటాల కోసం తిప్పలు పడాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also- Rahul Gandhi: దివంగత నేత అరుణ్ జైట్లీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
భారతీయులు ఎందుకు తరలి వెళ్తున్నారు?
ఇండియాలో ఏ పని జరగాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని, అందుకే విదేశాలకు తరలి వెళుతుంటారని అంకుర్ వివరించాడు. ‘‘ ఒక ప్రభుత్వాధికారి ముద్ర పడాలంటే వారం లేదా నెలల సమయం పడుతుంది. పౌరు బాధ్యతారాహిత్యంగా ఉంటారు. రోడ్లపైనే చెత్త వేయడం, ఉమ్మివేయడం చేస్తుంటారు. పగిలిపోయిన ఫుట్పాత్లు కనిపిస్తుంటాయి. వీటికి ఎవరూ బాధ్యత వహించరు. తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు. రోడ్లపై లైన్ మార్కింగ్లను అపహస్యం చేస్తుంటారు. ట్రాఫిక్ బోర్డులకు అర్థం ఏమిటో కేవలం 1 శాతం మందికి మాత్రమే తెలుస్తుంది. తక్కువ నమ్మకం ఉన్న సమాజం. నోటరీలు, జిరాక్స్లు, సెల్ఫ్ అటెస్టెడ్ ఫామ్స్ ఇవన్నీ తప్పనిసరిగా ఉండాల్సిందే. లంచం లేకపోతే పని జరగదు. డబ్బు ముట్టచెప్పకపోతే ప్రాజెక్ట్లు కదలవు. విద్యుత్ కోతలు, తాగునీటి కొరతలు, అభివృద్ధి చెందని రవాణా వ్యవస్థ. మరీ చిన్నచిన్న విషయాలకు కూడా రౌడీయిజం. ఉన్నత విద్యలో ఉక్కిరిబిక్కిరి చేసే కోటాలు. బైహార్ట్ చదువులు. తీవ్రమైన వాయు కాలుష్యం. ఉదయం జాగింగ్కి పోతే ఊపిరి తీసుకోవడమే పెద్ద కసరత్తు అవుతుంది. పాలసీలు, పన్నుల మార్పులు, దిగుమతులపై ఎప్పటికప్పుడు మారే నిబంధనలు’’ ఇవన్నీ భారతీయులు విదేశాలకు వెళ్లడానికి కారణాలను అంకుర్ పేర్కొన్నారు.