Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్(Alampur) చౌరస్తాలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల(Mahatma Gandhi Jyotirao Phule Gurukul School)లో కనీస వసతులైన తాగునీరు, బాత్ రూమ్స్, నాణ్యమైన భోజనము లేక జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు త్రాగడానికి స్వచ్ఛమైన త్రాగునీరు లేక ఫ్లోరైడ్ తో ఉన్న బోర్ ద్వారా వచ్చే ఉప్పు నీటిని త్రాగుతూ ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని విద్యార్థులు వాపోయారు. అంతేకాకుండా కాలకృత్యాలు తీర్చుకోవడానికి గదుల కొరతతో అవస్థలు పడుతున్నామన్నారు.
పురుగుల అన్నం
భోజనానికి పురుగులు పడిన అన్నం ఇస్తున్నారని,మా సమస్యలు పరిష్కరించడానికి ఏ సంబంధిత ఉన్నతాధికారి, రాజకీయ నాయకులు పట్టించుకోవడంలేదని, సమస్యలపై స్థానిక అధికారులకు పలుమార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని, తమ సమస్యలను ఎవరూ పరిష్కరించరని తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని భావించి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కలెక్టర్కు తమ సమస్యలు విన్నవించుకునేందుకు తమ పాఠశాల నుంచి పాదయాత్రగా విద్యార్థులు బయలుదేరారు.
Also Read: NIMS Fire: నిమ్స్ అగ్నిప్రమాదం కేసులో విచిత్రం
నిలువరించిన సిఐ సమస్య పరిష్కారానికి హామీ
విద్యార్థులు పాదయాత్ర వెళ్తున్న సమయంలో మానవపాడు మండలం ఇటిక్యాలపాడు గ్రామ సమీపంలో అలంపూర్ సిఐ రవిబాబు(CI Ravi Babu) తన సిబ్బందితో విద్యార్థులను నిలువరించి పాదయాత్రగా జాతీయ రహదారిపై వెళ్లడం ప్రమాదమని మీ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని నచ్చజెప్పి విద్యార్థులను డిసిఎం వాహనంలో తిరిగి గురుకుల పాఠశాలకు తీసుకెళ్లారు.
గురుకుల హాస్టల్ను సందర్శించిన ఎమ్మెల్యే
విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు గురుకుల హాస్టల్ ను సందర్శించారు. విద్యార్థుల భోజనానికి వాడుతున్న బియ్యాన్ని పరిశీలించారు. ఇతర మౌలిక వసతుల కల్పనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలను జిల్లా కలెక్టర్ కు, జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు.
Also Read: Rangareddy Murder Case: రాష్ట్రంలో ఘోరం.. ఫేమస్ కావాలని అక్కను చంపిన తమ్ముడు!