NIMS Fire: పోలీసింగ్లో దేశంలోనే నెంబర్1 స్థానంలో తెలంగాణ పోలీసులు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో సంచలనాత్మక కేసులను పరిష్కరించిన ఘనత వారి సొంతం. అయితే, సీసీ కెమెరాల ఫుటేజీ లేదు, ఏ ఒక్క ఆధారం కూడా దొరకలేదంటూ నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం కేసు విచారణను మాత్రం పక్కన పెట్టేశారు. భవిష్యత్తులో ఆధారాలు దొరికితే కేసు రీ ఓపెన్చేస్తామంటూ కోర్టుకు తెలిపారు. ప్రమాదంపై వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసిన వెస్ట్ జోన్ డీసీపీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించటానికి చర్యలు తీసుకోవాలని కోరడం గమనార్హం.
అసలేం జరిగింది?
ఏప్రిల్ 19న నిమ్స్ హాస్పిటల్ ట్రామా కేర్ బ్లాక్ 5వ అంతస్తులో సాయంత్రం 4.30గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే, అగ్ని ప్రమాదం జరిగిన అంతస్తులోనే ఉన్న ఆరోగ్య శ్రీ గదిలో పెద్ద మొత్తంలో బాణసంచాను నిల్వ చేసినట్టుగా వీడియోలు బయటికి రావడం మరింత కలవరాన్ని కలిగించింది. ఒకవేళ మంటలు ఆ గదికి వ్యాపించి ఉంటే ఊహించని దారుణం జరిగేదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. ప్రమాదంపై ఫిర్యాదు అందగా పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణలో అదనపు మెడికల్ సూపరిండింటెంట్ కృష్ణారెడ్డి ఈ వీడియోలు తీసినట్టుగా వెల్లడైంది. తానే ఆ వీడియోలు తీశానని చెప్పిన కృష్ణారెడ్డి బాణసంచాను తెచ్చి ఆస్పత్రిలో ఎవరు పెట్టారో? నిగ్గు తేల్చాలని పోలీసులను కోరారు. అయితే, పంజాగుట్ట పోలీసులు మాత్రం కేసును పరిష్కరించే ఆధారాలు లభించకపోవటంతో దానిని తాత్కాలికంగా మూసి వేస్తున్నామని కోర్టుకు నివేదిక ఇచ్చారు. భవిష్యత్తులో ఏవైనా ఆధారాలు దొరికితే కేసును రీ ఓపెన్ చేస్తామని తెలియచేశారు. ఇక వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసిన వెస్ట్ జోన్ డీసీపీ అగ్ని ప్రమాదం జరిగిన 5వ అంతస్తులో సీసీ కెమెరాలు లేవంటూ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రిలోని అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also- BJP: కొత్త నినాదంతో ప్రజల్లోకి బీజేపీ
పరిష్కరించలేరా?
కాగా, పోలీసుల ఈ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాల ఫుటేజీ లేకపోతే కేసులు పరిష్కరించలేరా? అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆరోగ్య శ్రీ గదిలోని బాణసంచాతోపాటు పెద్ద పెద్ద సూట్కేసులు కూడా మాయమైనట్టు నిమ్స్ఉద్కోగులు చెబుతున్నారు. బాణసంచా ఎవరు తెచ్చారు? ఎవరు తీసుకెళ్లారు? గదిలోని సూట్ కేసులు ఏమయ్యాయి? అన్నది తెలుసుకోవటం నిజంగా అంత కష్టమా అని అంటున్నారు. ప్రమాదం జరిగిన 5వ అంతస్తులో సీసీ కెమెరాలు లేకపోవచ్చుగానీ మిగితా చోట్ల ఉన్నాయి కదా? అని వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులు తలుచుకుంటే ఈ కేసును పరిష్కరించటం పెద్ద కష్టం ఏమీ కాదని అంటున్నారు. ఈ దిశగా ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకుంటారో? లేదో? వేచి చూడాల్సిందే.
Read Also- Nimisha Priya Case: నిమిష ప్రియకు భారీ ఊరట.. ఫలించిన చర్చలు.. మరణశిక్ష రద్దు!