Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) జట్టు ఆటగాళ్లను వ్యక్తిగతంగా ప్రశంసించడానికి అస్సలు ఇష్టపడడు. గెలుపైనా, ఓటమైనా జట్టు మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని మాట్లాడుతుంటాడు. అయితే, ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్పై ప్రశంసల జల్లు కురిపించాడు. పాదానికి తీవ్రమైన గాయం అయినప్పటికీ బాధను భరిస్తూ బ్యాటింగ్కు వచ్చి అర్ధ సెంచరీ పూర్తి చేసిన పంత్ను తెగ పొగిడాడు. ‘‘రిషబ్ పంత్ తదుపరి తరం క్రికెటర్లకు ప్రేరణ అందించాడు. ధైర్యం, ఓర్పుతో కూడిన ఆటతీరును ప్రదర్శించి అతడికంటూ ఓ ప్రత్యేకమైన, స్థిరమైన క్రికెట్ వారసత్వ ముద్రవేసుకున్నాడు. వ్యక్తిగతంగా అతడిని పక్కన పెట్టేసి జట్టును ముందుకు నడిపించాడు’’ అంటూ గంభీర్ మెచ్చుకున్నాడు.
ఈ మేరకు మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెసింగ్ రూమ్లో ఆటగాళ్లను ఉద్దేశించి గంభీర్ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్ వేదికగా సోమవారం విడుదల చేసింది. ‘‘నువ్వు (పంత్) ఈ డ్రెస్సింగ్ రూమ్కి మాత్రమే కాకుండా, తరం తరం క్రికెటర్లకు కూడా ప్రేరణ అందించావు. అందరూ నిజంగా చాలాచాలా అద్భుతంగా ఆడారు. నాకు వ్యక్తుల గురించి మాట్లాడటం ఇష్టం ఉండదు. టీమ్ గేమ్లో నేనెప్పుడూ వ్యక్తులల గురించి మాట్లాడలేదు. కానీ, నువ్వు (పంత్) తదుపరి తరం క్రికెటర్లకు ప్రేరణనిచ్చావు అని చెప్పాల్సిందే. ఇది నీ వారసత్వంగా నిలిచిపోతుంది. ఈ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది గుర్తుండిపోతుంది. అందుకే, నీకు టీమ్ నుంచి దేశం మొత్తం తరఫున అభినందనలు. నీ విషయంలో దేశం ఎప్పుడూ గర్వపడుతుంది’’ అని గంభీర్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
Read Also- MBBS Fees: రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్థాన్.. ఏ దేశంలో ఎంబీబీఎస్ ఫీజు తక్కువ?
కాగా, మాంచెస్టర్ టెస్టులో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. స్టోక్స్ బౌలింగ్లో పాదానికి గాయమైంది. బొటన వేలు ఫ్రాక్చర్ అయింది. అయినప్పటికీ క్రీజులోకి వచ్చి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, గాయం కారణంగా ఐదవ టెస్ట్ మ్యాచ్కు దూరం కాబోతున్నాడు. పంత్ స్థానంలో తమిళనాడుకు చెందిన నారాయణ్ జగదీశన్ను బీసీసీఐ సెలక్ట్ చేసింది.
అంతా జట్టు కోసమే: రిషబ్ పంత్
మాంచెస్టర్ టెస్టులో తీవ్ర గాయంతో కూడా బ్యాటింగ్ చేయడంపై డ్రెసింగ్ రూమ్లో ఆటగాళ్ల మధ్య రిషబ్ పంత్ మాట్లాడాడు. జట్టు గెలుపు కోసం ఏం చేయడానికికైనా సిద్ధమని, అందుకే బ్యాటింగ్కు దిగాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. బ్యాటింగ్కి వెళ్లడం తన వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో వ్యక్తిగత లక్ష్యాలేమీ లేవని వివరించాడు. జట్టును విజయ తీరాలకు అవసరమైనదాన్ని చేయాలన్న తపన మాత్రమే తనలో ఉందని రిషబ్ పంత్ వివరించారు. ఈ విషయంలో టీమ్ ఆటగాళ్లు కూడా తనకు అద్భుతంగా మద్దతు ఇచ్చారని అన్నాడు. టీమ్ ఒత్తడిలో ఉందని, ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ‘‘దేశం మొత్తం ఒకే లక్ష్యంతో మన వెనకాల నిలబడితే, ఆ భావోద్వేగాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నాకు గర్వకారణం. ఈ సందర్భంగా జట్టుకు ఒకే సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మనం గెలుద్దాం. మన దేశం కోసం విజయం సాధిద్దాం’’ అని పంత్ భావోద్వేగంగా స్పందించాడు.
Read Also- Thai Vs Cambodia: ట్రంప్ చెప్పినా తగ్గని థాయ్లాండ్, కాంబోడియా
పంత్పై సుందర్ ప్రశంసల జల్లు
యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా పంత్పై ప్రశంసలు కురిపించాడు. కాలు ఎంతగా వాపు వచ్చిందో తనకు తెలుసునని, పంత్ మన దేశ ముద్దుబిడ్డ అని అభివర్ణించాడు. ‘‘పంత్ ఎంతటి బాధ అనుభవించాడో మాటల్లో చెప్పలేం. బొటనవేలు ఫ్రాక్చర్ అయింది. అడుగు ఎటుపడినా నొప్పే. నేను స్వయంగా అతడి కాలు చూశాను. బాగా వాచింది. అటువంటి పరిస్థితిలో నడవడమే చాలానొప్పితో కూడుకున్న పని. కానీ, రిషబ్ పంత్ కేవలం నడవడమే కాదు, అంతకంటే ఎక్కువే చేశాడు. అంతటి త్యాగం చేసిన పంత్ను చూసి దేశం మొత్తం గర్విస్తోంది’’ అని పేర్కొన్నారు. రిషబ్ పంత్ ఇంగ్లండ్ సిరీస్లో మొత్తం 479 పరుగులతో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన రెండవ ప్లేయర్గా నిలిచాడు. నాలుగు టెస్టుల్లో ఏడు ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి 68.42 సగటు, 77 కంటే ఎక్కువ స్ట్రైక్రేట్తో ఈ పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 3 అర్ధశతకాలు ఉన్నాయి.