Air India: గత నెల జూన్ 12న ఎయిరిండియా (Air India) బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సోమవారం (2025 జులై 21) ఎయిరిండియాకు చెందిన మరో విమానం ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. కేరళలోని కొచ్చి నుంచి ముంబై చేరుకున్న ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ 2744 (VT-TYA) ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో రన్వే మీద నుంచి పక్కకు జారింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, విమానానికి నష్టం జరిగింది. విమానం టైర్లు పగిలిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంజిన్ కూడా దెబ్బతిన్నట్టుగా ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రమాదానికి తీవ్రమైన వర్షాలే కారణమని అధికారులు చెబుతున్నారు. రన్వే నుంచి పక్కకు జారిపోయిన విమానం నెమ్మదిగా టెర్మినల్ గేట్ వరకు వెళ్లింది. ప్రయాణికులు, సిబ్బంది అంతా అక్కడే సురక్షితంగా కిందకు దిగారు. విమానానికి చెందిన మూడు టైర్లు పగిలిపోయినట్టు ఎయిర్పోర్టు వర్గాల సమాచారం. ఇంజిన్కి కూడా కొంతమేర నష్టం జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also- Plane Crash: స్కూల్పై కూలిన ఎయిర్ఫోర్స్ విమానం.. మరో ఘోరం
ఎయిరిండియా ప్రకటన
విమానం రన్వేపై జారిన ఘటనపై ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘జులై 21న కొచ్చి నుంచి ముంబైకు చేరుకున్న ఏఐ-2744 విమానం ల్యాండింగ్ సమయంలో భారీ వర్షాల కారణంగా రన్వే పక్కకు జారింది. విమానం ఎలాంటి ప్రమాదం లేకుండా టెర్మినల్ గేట్ వరకు వెళ్లింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా కిందకు దిగారు. పరిశీలన కోసం విమానాన్ని గ్రౌండ్లోనే ఉంచాం. ఎల్లప్పుడూ ప్రయాణికుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తాం” అని ప్రకటనలో ఎయిరిండియా ప్రతినిధి వివరించారు.
Read Also- Nitish Reddy: సిరీస్ మధ్యలోనే నితీష్ కుమార్ రెడ్డి తిరుగుపయనం.. బీసీసీఐ కీలక ప్రకటన
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రతినిధులు కూడా ఈ ఘటనపై స్పందించారు. ‘‘సోమవారం ఉదయం 9.27 గంటలకు రన్వేపై విమానం జారింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెంటనే చర్యలు చేపట్టింది. రన్వే 09/27 (ప్రథమ రన్వే) కొద్దిగా దెబ్బతిన్నది. రిపేర్లకు సంబంధించిన పరిశీలనలు చేస్తున్నాం. విమానాల ప్రయాణాలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రన్వే 14/32ను (సెకండరీ రన్వే) తాత్కాలికంగా వినియోగిస్తున్నాం. ప్యాసింజర్ల భద్రతే మాకు ఎప్పటికీ అత్యంత ముఖ్యం’’ అని ఎయిర్పోర్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Read Also- Mumbai Blasts: ముంబై పేలుళ్ల కేసులో దోషులంతా నిర్దోషులే.. హైకోర్టు సంచలన తీర్పు