Ind vs Eng Test: భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య నాల్గో టెస్టు జులై 23న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 5 టెస్టుల మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-2 తేడాతో వెనుకంజలో ఉంది. దీంతో నాల్గో టెస్టులో ఎలగైనా గెలిచి సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని యువ సారథి గిల్ నేతృత్వంలోని టీమిండియా పట్టుదలగా ఉంది. ఆ దిశగా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తోంది కూడా. అయితే నాల్గో టెస్టు తుది జట్టులో కచ్చితంగా ఒక మార్పు చేయాల్సిన అవసరముందని మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డారు.
అతడ్ని మార్చేయండి!
భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ (Anderson-Tendulkar Trophy series) కీలకమైన ఘట్టానికి చేరుకున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా (Deep Dasgupta) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత మూడు టెస్టు మ్యాచుల్లో పేలవ ప్రదర్శన చేసిన కరుణ్ నాయర్ (Karun Nair) స్థానంలో.. యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan) కు అవకాశం కల్పించాలని టీమిండియా కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ కు సలహా ఇచ్చారు. ఈ సిరీస్ లో భారత్ తరపున ఒక్క అర్ధ శతకం చేయని టాప్ – 4 బ్యాటర్ కరుణ్ నాయర్ అని గుర్తుచేశారు. అతడికి మంచి స్టార్ట్ లభించినప్పటికీ దానిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోతున్నాడని అన్నారు. అంతేకాదు క్రీజులో చాలా అసౌకర్యంగా ఉంటున్నాడని ఆరోపించారు.
అతడే ఎందుకంటే?
సాయి సుదర్శన్ యంగ్ క్రికెటర్ అన్న దీపక్ దాస్ గుప్తా.. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వడం అవసరమని అభిప్రాయడ్డారు. తొలి టెస్టు మెుదటి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన సాయి సుదర్శన్ సెకండ్ ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేశాడని గుర్తుచేశారు. చివరి రెండు టెస్టు మ్యాచులకు అతడ్ని జట్టులోకి తీసుకుంటే కఠిన పరిస్థితుల్లో అతడి సామర్థ్యాలను పరీక్షించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ఇది టీమిండియా (Team India) భవిష్యత్ అవసరాలను తీర్చే అవకాశముందని పేర్కొన్నారు. పైగా ఇంగ్లాండ్ లో మళ్లీ టీమిండియా ఎప్పుడు ఆడుతుందో తెలియని నేపథ్యంలో యంగ్ క్రికెటర్ కు ఛాన్స్ ఇవ్వాలని కోచ్ గంభీర్ (Gautam Gambhir), కెప్టెన్ గిల్ (Shubman Gill)కు సలహా ఇచ్చారు.
Also Read: Vivek Venkatswamy: బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి వివేక్
ఫ్యాన్స్కు గుడ్ న్యూస్!
ఇదిలా ఉంటే జులై 23న మాంచెస్టర్ (Manchester)లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ (Old Trafford)లో భారత్ – ఇంగ్లాండ్ మధ్య నాల్గో టెస్టు జరగనుంది. సిరీస్ లో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ ను వెనక్కి నెట్టాలంటే నాల్గో టెస్టులో విజయం తప్పనిసరి. దీంతో గెలుపు కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో గంటల కొద్ది శ్రమిస్తున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. అయితే మూడో టెస్టులో గాయపడ్డ పంత్ సైతం.. నాల్గో టెస్టు నాటికి పూర్తి ఫిట్ నెస్ సాధించి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. భారత స్టార్ పేసర్ బుమ్రా (Jasprit Bumrah) సైతం అందుబాటులో ఉంటాడన్న సంకేతాలు అందాయి. ఇది ఫ్యాన్స్ కు శుభవార్తే. ఇక ఈ సిరీస్ లో ఐదో మ్యాచ్ జులై 31న నుండి ఆగస్టు 4 మధ్య లండన్ లోని ది ఓవల్ వేదికగా జరగనుంది.