Gadwal Hospitals: పేదలకు విద్య, వైద్యం అందిస్తామని ప్రభుత్వాలు హామీ ఇస్తున్నా,ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించాలనే ఆలోచనతో గత బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం హాయంలో రెండు రాష్ట్రాలకు సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లా (Gadwal District) జాతీయ రహదారి 44 సమీపంలోని అలంపూర్ చౌరస్తాలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని 21 కోట్లతో చేపట్టారు. నిర్మించి రెండు ఏళ్లు పూర్తవుతున్నా హాస్పిటల్ ను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో విఫలమవుతున్నారు. నాణ్యత లోపంతో ఇప్పటికే కొన్ని చోట్ల లీకేజీల సైతం చోటుచేసుకున్నాయి.కేవలం గత ఎలక్షన్ల ముందు మేము నిర్మించాము అని ప్రజలకు చెప్పుకునేందుకు ఆర్భాటంగా హడావిడిగా అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అబ్రహంతో(Abraham) కలిసి హాస్పిటల్ ను ప్రారంభించారు.
Also Read: KTR on Congress: పాలన అంటే శంకుస్థాపనలు కాదు కేటీఆర్ సంచలన కామెంట్స్!
వృథాగా పడి ఉన్న వైద్య పరికరాలు
జాతీయ రహదారి – 44 పై ఏ ప్రమాదం జరిగినా కర్నూలు ఆస్పత్రులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ కారణంగా వైద్య సేవలు ఆలస్యంతో పలువురు క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం ఉన్నాయి. ఈ ఆస్పత్రి ప్రారంభం అయ్యాక వైద్య సేవలకు అవసరమైన కొంత సామాగ్రి, సదుపాయాలు ఏర్పాటు చేశారు. 100 పడకల్లో సామాగ్రి, ఆక్సిజన్ పరికరాలు, సెలైన్ బాటిల్ స్టాండ్స్, వైద్య పరీక్షలు నిర్వహించే పరికరాలు అన్ని వచ్చేశాయి. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, జనరల్, మెటర్నరీ వార్డులు సకల సదుపాయాలు కల్పించారు. సంవత్సరాలు గడుస్తున్నా వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కేటాయింపులు లేక విలువైన వైద్య సామాగ్రి దుమ్ము పట్టిపోతున్నాయి. నిర్మించిన ఆసుపత్రి పై నిఘా పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని పరికరాలు, సామాగ్రి చోరికి గురైంది.
పూర్తిస్థాయి సిబ్బంది, మెటీరియల్ కల్పించేరా
అలంపూర్ చౌరస్తాలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రికి రాజకీయ గ్రహం కారణంగా నేటికీ అందుబాటులోకి రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి కర్నూలు, హైదరాబాద్ వంటి నగరాలకు అత్యవసర చికిత్స నిమిత్తం పోవాల్సి వస్తోంది. 44 వ జాతీయ రహదారిపై నిత్యం అనేక వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. తరచుగా వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా సమీపంలో ఆసుపత్రి అందుబాటులోకి వస్తే సకాలంలో ప్రమాదాలకు గురైన ప్రయాణికుల ప్రాణాలు కాపాడవచ్చు.
అందుకు ఆధునిక మెటీరియల్ తో పాటు విభాగాల వారిగా వైద్యుల నియామకం చేపట్టాల్సి ఉంది.నాసిరకపు నిర్మాణంతో కొన్నిచోట్ల గోడలకు బీటలు వారాయి. తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 11 నెలల క్రితం నూతన ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు.. అవసరమైన సిబ్బందిని, వైద్య సామాగ్రిని కల్పిస్తామని ప్రకటించారు.జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ప్రారంభం కావడంతో అందుబాటులో ఉన్న సిబ్బందిని జూన్ నుంచి సిబ్బందిని ఆసుపత్రికి కేటాయించారు.
త్వరలో వైద్య సేవలు అందుబాటులోకి : డా. రమేష్ చంద్ర డి సి హెచ్ ఎస్*
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఓ.పి నిర్వహించేందుకు అవసరమయ్యే మెటీరియల్ ను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. వైద్య విధాన పరిషత్ ద్వారా వైద్యులు, సిబ్బందిని నియమించి ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం.
Also Read: AP Deputy CM Pawan: కోట శ్రీనువాసరావు మరణ వార్త విని తీవ్ర ఆవేదనకు లోనయ్యా.. పవన్ కళ్యాణ్