Collector Hari Chandana: విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ధైర్యం, పట్టుదలతో అధిగమించి తమ లక్ష్యాలను సాధించుకోవాలని జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి (Collector Hari Chandana) సూచించారు. షేక్ పేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, అక్కడ కౌమార దశలో ఉన్న విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి “గెట్ ఆసమ్” పేరిట జరుగుతున్న వర్క్షాప్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను (Students) ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ.. మానవ జీవితంలో అవరోధాలు, అపజయాలు, ఒడిదుడుకులు సహజమని, వాటిని ఎదుర్కొని తమ కలల సాకారానికి శ్రమించాలని ధైర్యం చెప్పారు. చదువుతో పాటు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని జయించాలని సూచించారు.
Also Read: Sambasiva Rao Slams Modi: ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేసేందుకు మోదీ ప్లాన్!
రాబర్ట్ బ్రూస్ కథ
విద్యార్థులు (Students) తమ లక్ష్య సాధనలో ఒంటరిగా కాకుండా బృందంగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఉద్బోధించారు. తాను సివిల్ సర్వీస్ సాధనలో తన మిత్రులతో కలిసి బృందంగా ప్రిపేర్ అయ్యి అందరూ విజయం సాధించామని ఆమె తెలిపారు. రాబర్ట్ బ్రూస్ కథను ఉదాహరణగా వివరిస్తూ.. స్కాట్ల్యాండ్ కోసం పోరాడి ఓటమి పాలై నిరాశ నిస్పృహలతో ఉన్న బ్రూస్ రాజు ఒక సాలీడు తన గూడు నిర్మించుకోవడంలో పదే పదే విఫలమవుతున్నా పట్టువదలకుండా ప్రయత్నించడం గమనించాడని, చివరికి సాలీడు సఫలం కావడం చూసి తాను కూడా పట్టువదలక యుద్ధం చేసి విజయం సాధించాడని కలెక్టర్ (Collector) వివరించారు.
ప్రత్యేక శిక్షణ
విద్యార్థులు కూడా ఇష్టపడి, మొక్కవోని దీక్షతో, బృందాలుగా ఏర్పడి తమ ప్రయత్నాలు సాధించాలని ఆమె సలహా ఇచ్చారు. టీనేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ లలితా ఆనంద్ కౌమార దశలో ఉన్న విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి “గెట్ ఆసమ్” పేరిట వర్క్షాప్ నిర్వహించారని కలెక్టర్ తెలిపారు. ఈ వర్క్షాప్లో ఒత్తిడిని జయించడం, ఏకాగ్రత, ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడం కోసం ధ్యానం, యోగాసనాలు, డాన్స్, బృంద కార్యక్రమాల నిర్వహణపై విద్యార్థులకు (Students) ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
పాఠశాల అభివృద్ధి సమీక్ష..
అనంతరం షేక్ పేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల అభివృద్ధిని జిల్లా కలెక్టర్ (Collector) సమీక్షించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐఐటీ, జేఈఈ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ను అభినందించారు. కళాశాల మైదానంలో మొక్క నాటి, పాఠశాల ఆవరణలో విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలస్వామి, అధ్యాపకులు బాలరాజు, బీమయ్య, వివిధ విభాగాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read:Bhadradri Kothagudem: చెరువులో ఏం కలుస్తోంది.. విష జ్వరాలకు కారణమేంటి?
