Vadodara bridge collapse: ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ (Gujarat)లో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వడోదర జిల్లా పద్రాలోని మహిసాగర్ నదిపై ఉన్న వంతెన కుప్పకూలి.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు ట్రక్కులు, ఒక ఎస్ యూవీ, ఒక పికప్ వ్యాన్, ఆటో సహా ఐదు వాహనాలు నదిలో పడిపోవడంతో వారంతా ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో రాష్ట్రంలోని అధికార బీజేపీపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.
ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలే!
వడోదరాలో వంతెన కూలిన ఘటనపై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేట్ (Supriya Shrinate) తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది దైవ ఘటన కాదు.. మోసం అని ఆమె వ్యాఖ్యానించారు. సదరు వంతెన 40 ఏళ్ల క్రితం నిర్మించిందన్న ఆమె.. బలహీనంగా మారిందంటూ ఇటీవలే స్థానిక రిపోర్టర్ హెచ్చరించారని గుర్తుచేశారు. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె మండిపడ్డారు. స్థానిక ప్రజలు సైతం వంతెన బలహీనంగా మారిందని, వాహనాలు ప్రయాణించిప్పుడు ఊగిపోతోందని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు.
బీజేపీ కమిషన్
ప్రమాదానికి ముందు వంతెన మరమ్మతుల కోసం భారీ ఎత్తున నిధులను ప్రభుత్వం ఖర్చు చేసిందని సుప్రియా శ్రీనేట్ అన్నారు. అయినప్పటికీ వంతెన కూలిపోయిందని చెప్పారు. కాంట్రాక్టర్ కు చెల్లించిన డబ్బులో కమిషన్ రూపంలో బీజేపీ కోత పెట్టిందని ఆమె ఆరోపించారు. దీని వల్ల కాంట్రాక్టర్ తన పనిని సమర్థవంతంగా చేయలేకపోయారని అన్నారు. అంతేకాదు గత కొన్ని నెలలుగా ఈ తరహా అవినీతి ఘటనలు గుజరాత్ లో కనిపిస్తూనే ఉన్నాయని సుప్రియా ఆరోపించారు. వంతెన కూలిపోవడానికి బీజేపీనే వహించాలని పట్టుబట్టారు.
తృణమూల్ సూటి ప్రశ్న
వంతెన కూలి మరణించిన వారి కుటుంబాలకు శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చుతుర్వేది సంతాపం తెలిపారు. ‘గుజరాత్ ప్రజలు ఇటువంటి నాసిరకం పనులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతారు. ప్రభుత్వంతో పాటు కాంట్రాక్ట్ ఏజెన్సీలను దీనికి జవాబీదారుగా ఉంచుతారు’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సైతం వడోదర ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడింది. రెండేళ్ల క్రితం జరిగిన మోర్బి వంతెన విషాదాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. ‘ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఇలాంటి విషాదాలు పదే పదే జరుగుతున్నందున మాదో ప్రశ్న. ఇది దేవుని చర్యనా లేదా మోసపూరిత చర్యనా’ అంటూ బీజేపీని నిలదీసింది.
Also Read: War 2: తారక్తో ఆ అనుభవం మర్చిపోలేను.. కియారా అలా ఓపెన్ అయ్యిందేంటి!
ప్రధాని సంతాపం
వడోదరాలో వంతెన కూలిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Modi) తీవ్ర సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.50,000 చొప్పున సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) కింద దీనిని బాధితులకు ఇవ్వనున్నట్లు పీఎంఓ కార్యాలయం తెలియజేసింది.