Srikalahasti: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో అర్ధరాత్రి గ్యాంగ్ వార్ జరిగింది. తొట్టంబేడు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో దాడి చేసుకున్నాయి. కర్రలు, కత్తులు, రాళ్లు, రాడ్లతో వీరంగం సృష్టించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోనే ఇదంతా జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. సీసీటీవీలో రికార్డు కాగా అవి భయందోళనకు గురిచేస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
శ్రీకాళహస్తిలోని మంచినీళ్ల గుంట ఏరియాకు చెందిన రోహిత్, ధనుష్ లు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. వారిని వి.ఏం. పల్లి కాలనికి చెందిన కె. భాను, చరణ్, కిరణ్ లు అడ్డుకున్నారు. వారిపై దాడి చేయడంతో రోహిత్, ధనుష్ లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వారి ఫ్రెండ్స్ సుధాకర్, మునిరత్నం, ముని రాజా.. గాయపడ్డ స్నేహితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రి వద్ద బీభత్సం
అయితే ఏరియా ఆస్పత్రిలో రోహిత్, ధనుష్ చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న భాను, చరణ్, కిరణ్.. మరోమారు దాడి చేసేందుకు కొందరితో అక్కడికి వెళ్లారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో దాడి జరిగింది. అరగంట నుంచి గంట పాటు ఆసుపత్రి ఆవరణలో కర్రలు, రాళ్ళు, పెట్రోల్ బాటిళ్లతో బీభత్సం సృష్టించారు. దీంతో ఆస్పత్రి ఆవరణ మెుత్తం.. రక్తపు చుక్కలు పడి భయానకంగా మారింది.
రోగులు, వైద్య సిబ్బంది పరార్
మరోవైపు రెండు వర్గాలు పరస్పరం దాడికి దిగడంతో ఆస్పత్రిలోని సిబ్బంది, రోగులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. తలోదిక్కు పారిపోయారు. దాడి సమాచారం అందుకున్న కాళహస్తి టూటౌన్ పోలీసులు.. వెంటనే ఆస్పత్రి ప్రాంగణానికి చేరుకొని ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: కేంద్రమంత్రి మాండవీయతో సీఎం రేవంత్ చర్చలు
పాతకక్షలే కారణం!
అయితే పాతకక్షల నేపథ్యంలో రెండు గ్యాంగులు.. ఇలా పరస్పరం దాడి చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరా సాయంతో నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలియజేశారు. దాడి వెనక ఎలాంటి రాజకీయ కోణం లేదని డీఎస్పీ నరసింహ మూర్తి తెలియజేశారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
శ్రీకాళహస్తిలో గ్యాంగ్ వార్.. కత్తులు కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో దాడి
ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కత్తులు కర్రలు ఇనుప రాడ్లు, రాళ్లతో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ
ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది , పేషెంట్లు భయంతో పరుగులు.
నలుగురికి గాయాలు, కేసు నమోదు చేసిన పోలీసులు. pic.twitter.com/jN4kG8gQh1— ChotaNews App (@ChotaNewsApp) July 7, 2025