Nagpur Horror: వివాహేతర సంబంధాలు కాపురాలను నిలువునా చీల్చేస్తున్నాయి. అన్యోన్యంగా కలకాలం జీవించాల్సిన భార్య భర్తలను హంతకులుగా మార్చేస్తున్నాయి. జీవిత భాగస్వామిని అత్యంత దారుణంగా హత్య చేసేలా వివాహేతర సంబంధాలు పురిగొల్పుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలో ఘోరం జరిగింది. అనారోగ్యంతో మంచానపడ్డ భర్తను కట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి హత్య చేసింది.
వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్ర నాగ్ పుర్ లోని తరోడి ఖుర్ద్ ప్రాంతానికి చెందిన చంద్రసేన్ రామ్టేకే (38), దిశా రామ్టేకే (28) భార్య భర్తలు. ఏడాది క్రితం చంద్రసేన్ (Chandrasen Ramteke) కు పక్షవాతం రావడంతో అప్పటి నుంచి మంచం మీదనే ఉంటున్నాడు. అయితే తాజాగా చంద్రసేన్ అనుమానస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యం కారణంగానే ఆయన చనిపోయినట్లు అందరికీ చెప్పింది. స్థానికులు, బంధువుల సమక్షంలో బోరున విలపించింది. అయితే దిశా మాటలు తేడాగా అనిపించడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భర్తకు తెలిసిపోవడంతో..
బంధువుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. చంద్రసేన్ బాడీని పోస్ట్ మార్టంకు పంపారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎవరో ఊపిరాడకుండా చేయడం వల్లే అతడు చనిపోయినట్లు తేలింది. దీంతో తమదైన శైలిలో మృతుడి భార్య దిశను పోలీసులు విచారించగా భర్త చంద్రసేన్ ను తానే హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. పోలీసుల వివరాల ప్రకారం.. భర్త అనారోగ్యానికి గురి కావడంతో దిశ.. స్థానికంగా ఉండే ఆసిఫ్ అలియాస్ రాజాబాబు టైర్ వాలా (28)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి బంధం గురించి భర్తకు తెలిసిపోవడంతో తరుచూ చంద్రసేన్, దిశా మధ్య గొడవలు జరుగుతుండేవి.
Also Read: Rupee Fall: మన ‘రూపాయి’కి ఏమైంది?.. ఇవాళ ఒక్కరోజే భారీ పతనం
నిందితులు అరెస్ట్
అయితే భార్య ఎక్కడకు వెళ్లినా భర్త ప్రశ్నిస్తుండటంతో దిశాకు కోపం కట్టలు తెంచుకుంది. దీంతో మంచాన ఉన్న అతడి అడ్డును ఎలాగైనా తొలగించుకొని.. ప్రియుడితో హ్యాపీగా ఉండాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ప్రియుడు ఆసిఫ్ కు చెప్పగా అతడు కూడా ఓకే చెప్పాడు. దీంతో మంచాన నిద్రిస్తున్న భర్త చేతులను దిశా పట్టుకోగా.. ఆసిఫ్ ముఖాన దిండుపెట్టి ఊపిరాడకుండా చేశాడు. దీంతో చంద్రసేన్ సెకన్ల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు వివరించారు. హత్యారోపణలపై దిశా, ఆమె ప్రియుడు ఆసిఫ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.