Falcon Scam: అధిక వడ్డీ ఆశ చూపించి ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను మోసం చేసిన ఫాల్కన్ కంపెనీ (Falcon Company) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్ (Aryan Singh) అలియాస్ (Ryan Singh Chhabra) ఆర్యన్ సింగ్ చాబ్రాను సీఐడీ (CID) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సీఐడీ (CID) అదనపు డీజీపీ చారూ సిన్హా (DGP Charu Sinha) వెల్లడించిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ నివాసి అయిన ఆర్యన్ సింగ్ చాబ్రా మరికొందరితో కలిసి కొంతకాలం క్రితం ఫాల్కన్ కంపెనీని ప్రారంభించాడు.
Also Read: Medchal News: పుట్టగొడుగుల్లా వెలుస్తున్న రసాయన పరిశ్రమలు
4,215 కోట్ల రూపాయలు
ఆ తర్వాత తన సహచరులతో కలిసి ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అప్లికేషన్ను అభివృద్ధి చేశాడు. ఈ అప్లికేషన్లో, పేరున్న మల్టీనేషనల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లుగా నకిలీ పత్రాలను అప్లోడ్ చేశారు. ఆ తర్వాత, సోషల్ మీడియా (Social media) ద్వారా తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ చెల్లిస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాకుండా, టెలీకాలర్లను నియమించుకుని వందల మందిని తమ వలలోకి లాగారు. ఈ విధంగా మొత్తం 7,056 మందిని మోసగించిన నిందితులు వారి నుంచి రూ. 4,215 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. లూటీ చేసిన డబ్బు నుంచి ఆర్యన్ సింగ్ తన సొంత ఖాతాలోకి రూ.1 కోటి 62 లక్షల రూపాయలను మళ్లించుకున్నాడు.
మిగతా నిందితుల కోసం గాలింపు
అయితే, డిపాజిటర్లకు మాత్రం ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా నిందితులు కార్యాలయాలను మూసివేసి పరారయ్యారు. ఈ మేరకు బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో సీఐడీ (CID) అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసులు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న ఆర్యన్ సింగ్ను పంజాబ్ రాష్ట్రం భటిండాలోని ఓ గురుద్వారా నుంచి అరెస్ట్ చేసి (Hyderabad) హైదరాబాద్కు తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు. ఆర్యన్ సింగ్ అరెస్టుతో ఈ కేసులో పట్టుబడ్డ వారి సంఖ్య 9కి చేరిందని అదనపు డీజీపీ చారూ సిన్హా (DGP Charu Sinha) తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆమె చెప్పారు.
Also Read: SR Nagar Police Station: పైసలు కొట్టినవారికే వంత పాడుతున్న పోలీసులు!