Ban on Pak: దయాది దేశం పాకిస్థాన్ కు చెందిన సెలబ్రిటీలకు భారత ప్రభుత్వం (Indian Govt) మరోమారు బిగ్ షాక్ ఇచ్చింది. పాక్ సెలబ్రిటీలు సహా క్రికెటర్ల సోషల్ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం విధించింది. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సింధూర్ (Opertion Sindoor) ఉద్రిక్తతల తర్వాత పాక్ కు చెందిన న్యూస్ చానళ్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను కేంద్రంలోని మోదీ సర్కార్ బ్యాన్ చేసింది. అయితే అనూహ్యంగా బుధవారం రాత్రి అవి తిరిగి ప్రత్యక్షం కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అలెర్ట్ అయిన కేంద్రం ప్రభుత్వం.. ఆయా ఖాతాలపై ఆంక్షలను పునరుద్ధరించింది.
వివరాల్లోకి వెళ్తే..
పాకిస్థాన్ కు చెందిన సినీ, క్రీడా ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు, న్యూస్ ఛానెళ్లు బుధవారం ఒక్కసారిగా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. హనియా అమీర్, మహీరా ఖాన్, క్రికెట్ షాహిద్ అఫ్రిది, మావ్రా హోకెన్, ఫవాద్ ఖాన్ తదితరుల ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అన్ బ్లాక్ అయ్యాయి. వాటిని చూసి షాకైన భారతీయ నెటిజన్లు.. పాక్ సెలబ్రిటీలపై కేంద్రం విధించిన బ్యాన్ ఎత్తివేశారా? అంటూ ఆలోచనల్లో పడ్డారు. అంతేకాదు మరికొందరు కేంద్రం ప్రభుత్వం నేరుగా విమర్శలు గుప్పించారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్ ను మానసికంగా దెబ్బతీసిన పాక్ విషయంలో మళ్లీ ఉదారంగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు.
సాంకేతిక లోపం వల్లే..
అయితే బుధవారం ఓపెన్ అయిన పాక్ సెలబ్రిటీల ఖాతాలు గురువారం బ్లాక్ అయినట్లు కనిపించాయి. ‘భారతదేశంలో ఖాతా అందుబాటులో లేదు. ఈ కంటెంట్ను పరిమితం చేయాలనే చట్టపరమైన అభ్యర్థనను మేము పాటించినందున ఇది జరిగింది’ అంటూ వారి ఖాతాలకు సంబంధించి పాప్ అప్ సందేశం దర్శనమిస్తోంది. దీంతో కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా మరోమారు నిషేధం విధించినట్లు అర్థమవుతోంది. సాంకేతిక లోపం కారణంగా బుధవారం పాక్ సెలబ్రిటీల ఖాతాలు కనిపించినట్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి సమాధానం ఇచ్చినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. సాంకేతిక లోపం సరిదిద్దబడి తిరిగి పాక్ కి చెందిన వారి ఖాతాలు బ్లాక్ అయ్యాయని స్పష్టం చేశారు.
Also Read: Hari Hara Veera Mallu: ఒక్కటే మాట.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ఎలా ఉందంటే!
ఆంక్షలకు కారణమిదే!
జమ్ముకశ్మీర్ లోని పహల్గాం జరిగిన ఉగ్రదాడిలో 22 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మతం అడిగి పేరు మహిళల పసుపు కుంకాలను ముష్కర మూక తుడిచివేసింది. దీనిని సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్థాన్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. శత్రు దేశంలోని ఉగ్రస్థావాలపై వైమానిక దాడులు జరిపి నాశనం చేసింది. అంతటితో ఆగకుండా పాకిస్థాన్ పై ద్వైపాక్షిక ఆంక్షలను సైతం భారత్ షురూ చేసింది. భారత్ పై విషం చిమ్ముతున్న పాక్ మీడియా చానళ్లు.. డాన్ న్యూస్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్ సహా 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెల్స్ ను భారత్ లో ప్రసారం కావడాన్ని నిషేధించింది. అలాగే పాక్ సెలబ్రిటీలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను స్థంబింప జేసింది.