Facebook: యూజర్లకు మరింత పవర్ఫుల్ ఏఐ టూల్స్ను (AI Tools) అందించడమే లక్ష్యంగా టెక్ దిగ్గజం మెటా (Meta) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, ఫేస్బుక్ వేదికగా టెస్టింగ్స్ చేపడుతోంది. ఇందుకోసం ఫేస్బుక్ యూజర్ల ‘కెమెరా రోల్’ యాక్సెస్ను కోరుతోంది. అంటే, కెమెరాతో తీసిన ఫొటోలు, వీడియోలను విశ్లేషించడానికి అనుమతి కోరుతోంది. ఫేస్బుక్లో ఇప్పటివరకు పోస్టు చేయకుండా ఫోన్లో స్టోర్ చేసిన ఫొటోలు, వీడియోల యాక్సెస్ కూడా ఇందులో భాగంగా ఉంది. పెద్దగా ప్రచారం లేకుండానే ఈ టెస్టింగ్ చేపడుతోంది. అయితే, కెమెరా రోల్ యాక్సెస్ ద్వారా నేరుగా యూజర్ల మీడియాలోని ఫొటోలు, వీడియోల సమాచారాన్ని సేకరించాలనే ఆలోచనపై అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత గోప్యతకు భంగంవాటిల్లుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఫేస్బుక్ ఏం కోరుకుంటోంది?
ఫేస్బుక్లో కొత్త స్టోరీని పోస్ట్ చేయడానికి ముందు యూజర్లకు ఒక ‘పాప్-అప్’ను చూపిస్తుంది. ‘‘ఫొటో కోల్లెజ్లు, రీక్యాప్ ఫిల్మ్స్, ఫొటోల స్టైలిష్ వెర్షన్లలో చూపించేందుకు ఏఐని మీరు ఉపయోగించుకోవచ్చు’’ అని చెబుతుంది. అయితే, ఇందుకోసం ఫేస్బుక్ యూజర్ల కెమెరా రోల్ను పరిశీలించాల్సి ఉంటుంది. దానికోసం ‘అనుమతించు’ (అలౌ) మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే అంగీకరించినట్టే లెక్క. ఒక్కసారి యాక్సెస్ ఇస్తే యూజర్లు షేర్ చేయకపోయినా ఫోన్లోని ఫొటోలు, వీడియోలను ఫేస్బుక్ దాని క్లౌడ్ సర్వర్లకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏఐని ఉపయోగించి ఆ ఫొటోల్లోని వ్యక్తులు, ప్రదేశాలు, ఏయే తేదీలలో దిగారనే విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఆ సమాచారం ఆధారంగా ఫొటోలు, రీక్యాప్స్ వంటి ‘క్రియేటివ్ సజెషన్స్’కు ఫేస్బుక్ ఉపయోగించుకుంటుంది. ఫేస్బుక్ చేపడుతున్న ఈ టెస్టింగ్ను ‘టెక్క్రంచ్’ న్యూస్డైలీ (TechCrunch) తొలుత రిపోర్ట్ చేసింది.
Read this- Kareena Kapoor: సైఫ్పై దాడి గురించి తొలిసారి స్పందించిన కరీనా కపూర్
ఎలాంటి ప్రకటనా చేయకుండానే
మార్పునకు సంబంధించిన సమాచారాన్ని మెటా తన బ్లాగ్లో వివరించలేదు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ల వినియోగదారుల కోసం సమాచారం అందించేందుకు మెటాకు ఒక హెల్ప్ పేజీ ఉంది. అందులో కూడా ఎక్కడా ప్రకటన చేయలేదు. న్యూస్ రూపంలో కూడా ప్రకటించలేదు. యాప్లో కూడా ఈ విషయాలను పెద్దగా పేర్కొనలేదు. ఈ ఫీచర్ అకస్మాత్తుగా కనిపిస్తోందని, దేనికోసమే తెలియదని కొందరు చెబుతున్నారు. అయితే, ఒక్కసారి ఈ ఫీచర్కు యాక్సెస్ ఇస్తే మాత్రం ఫొటోలు, వీడియోల అప్లోడింగ్ బ్యాక్గ్రౌండ్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. యూజర్లు ఎప్పటికీ షేర్ చేయకూడదనుకున్న ఫొటోలు సైతం మెటాకు టెస్టింగ్ డేటాగా ఉపయోగపడతాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఫొటోలు ఏమవుతాయి?
ప్రతిపాదిత ‘ఏఐ టూల్’ను ఉపయోగించుకుంటామంటూ మెటాకు పర్మిషన్ ఇస్తే… యూజర్ల ఫొటోలు, వారి ఫ్రెండ్స్, పరిచయమన్న వ్యక్తులతో పాటు ఇంట్లో వ్యక్తులు, ఇంట్లో జరుపుకునే ప్రత్యేక సందర్భాల డేటా కూడా మెటా చేతికి చేరుతుంది. ఈ సమాచారాన్ని మెటా స్టోర్ చేసుకోవచ్చు, ఏఐ మోడల్స్ను మెరుగుపరచుకోవడానికి ఉపయోగించవచ్చు. ఏఐ-జనరేటెడ్ వెర్షన్లను క్రియేట్ చేయడానికి, లేదా కంటెంట్ను ఒకచోట చూపించడానికి డివైజ్లలోని మీడియాను ఉపయోగించుకుంటుంది. ఈ డేటాను దుర్వినియోగపరచబోమని మెటా చెబుతున్నప్పటికీ, డేటాను ఎంతకాలం స్టోర్ చేసుకునే అంశంపై మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. డేటాను ఏవిధంగా ప్రొటెక్షన్ చేస్తుందనేది కూడా చెప్పలేదు. దీనిపై యూజర్లు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ప్రకటనల కోసం కూడా ఈ డేటాను ఉపయోగించబోమని మెటా తెలిపింది.
Read this-Kolkata Case: లా విద్యార్థిని కేసు.. మనోజిత్ పెద్ద గలీజ్ గాడు.. వాడి చరిత్ర ఇదిగో
అయితే, ఈ విధంగా వ్యక్తుల డివైజ్లలోని కంటెంట్ను ఆటోమెటిక్గా స్కానింగ్ చేస్తే ఇండియాలో గోప్యతకు సంబంధించిన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ గ్యాలరీలలో ఫ్యామిలీ ఫొటోలు, పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాలకు సంబంధించిన ఫొటోలు, సర్టిఫికెట్లు, కొన్ని వ్యక్తిగతమైన సమాచారం కూడా ఉంటుంది. అందుకే, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త టెస్టింగ్కు సంబంధించిన సమాచారాన్ని ఇంగ్లీష్తో పాటు ఇతర ఏ భాషల్లోనూ పేర్కొనకపోవడంతో భారత్లోని యూజర్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికా, కెనడాలో టెస్టింగ్ చేస్తున్నారు.